Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!

  • హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్!
  • ప్రధాన నిందితురాలి బెయిల్ మంజూర్
  • నిర్ఘాంతపోయిన యావత్తు దేశం
  • హైకోర్టులో సవాల్ చేయనున్న బాధిత కుటుంబం
Honeymoonmurdercase

Honeymoonmurdercase

హనీమూన్ మర్డర్ కేసు.. యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కేసు. కట్టుకున్నవాడిని పారాణి ఆరకముందే అత్యంత దారుణంగా భార్య చంపేసింది. అంతటి దారుణమైన సంఘటన. మహిళా సమాజమే నివ్వెరపోయింది. అలాంటిది నిందితురాలికి బెయిల్ రావడం మరింత షాక్‌కు గురి చేస్తోంది. అసలేం జరిగింది?. నిందితురాలి బెయిల్ ఎలా వచ్చింది?. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

రాజా రఘువంశీ మధ్యప్రదేశ్‌కు ఇండోర్ వాసి. మంచి బిజినెస్‌మేన్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనమ్ రఘువంశీతో 2025, మే 11న అత్యంత గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23న దంపతులు అదృశ్యమైనట్లు వార్త కలకలం రేపింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి షిల్లాంగ్ కొండలను జల్లెడ పట్టారు. జూన్ 2న కొండల్లో రాజా రఘువంశీ మృతదేహం లభించింది. గాయాలను బట్టి హత్యగా కేసు నమోదు చేశారు. ఇక భార్య సోనమ్ రఘువంశీ ఏమైందని దర్యాప్తు చేస్తుండగా అకస్మాత్తుగా జూన్ 8న యూపీలోని పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. విచారించగా ప్రియుడు, హంతక ముఠాతో కలిసి చంపేసినట్లుగా పేర్కొంది. దీంతో యావత్తు దేశం కలవరపాటుకు గురైంది. అనంతరం నిందితులను జైలుకు పంపించారు.

తాజాగా ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూర్ అయింది. సాక్ష్యాధారాలకు, సాక్షులకు దూరంగా ఉండాలని.. అలాగే షిల్లాంగ్ విడిచి వెళ్లొద్దని కోర్టు హెచ్చరించింది. ఇంత దారుణమైన కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక బాధిత కుటుంబమైతే ఆశ్చర్యపోతుంది.

నిందితురాలికి బెయిల్ రావడంతో షిల్లాంగ్ పోలీసులు డొల్లతనం బయటపడింది. దర్యాప్తు లోపంగా తేలింది. దాదాపు నిందితులపై 790 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. కానీ ఛార్జిషీట్ అంతా డొల్లతనం అని తేలిపోయింది. ఎక్కడా కూడా నిందితులపై మర్డర్ సెక్షన్ల నమోదు చేయకపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐపీసీ సెక్షన్ 103 (1) కాకుండా ఐపీసీ సెక్షన్ 403 (1) నమోదు చేశారు. హత్య కేసుగా కాకుండా ఆస్తిని అక్రమంగా దుర్వినియోగం చేశారంటూ అభియోగం మోపారు. అటు యూపీ పోలీసులు గానీ.. ఇటు మేఘాలయ పోలీసులు గానీ తీవ్రమైన హత్యా అభియోగాలు మోపడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో నిందితురాలికి భారీగా ప్రయోజనం చేకూరింది. సోనమ్‌ను అసలెందుకు అరెస్ట్ చేశారో కూడా న్యాయస్థానానికి స్పష్టమైన ఆధారాలు సమర్పించడంలో ఖాకీలు విఫలమయ్యారు. దీంతో అరెస్ట్ అనేది ప్రాథమిక హక్కులకు సంబంధించిందని.. ఆర్టికల్ 22 (1)ను నేరుగా ఉల్లంఘించడమేనని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సోనమ్ రఘువంశీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సోనమ్‌కు బెయిల్ రావడంతో ఇతర నిందితులకు కూడా ఈజీగా బెయిల్ రావొచ్చు. అంతేకాకుండా ఈ కేసు నుంచి సులువుగా కూడా బయటపడొచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.

షరతులు..
సోనమ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు విధించింది. సాక్ష్యాలు లేదా సాక్షులకు దూరంగా ఉండాలని.. వాటిని తారుమారు చేయవద్దని హెచ్చరించింది. ప్రతి విచారణకు కోర్టుకు హాజరు కావాలని.. అనుమతి లేకుండా షిల్లాంగ్ జిల్లాను విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. బెయిల్‌కు రూ. 50,000 పూచీకత్తు కూడా అవసరం కాగా.. సోనమ్ తండ్రి దేవి సింగ్ ఇండోర్ నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణించి పూచీకత్తును సమర్పించారు. షిల్లాంగ్ జైలు బయట దేవి సింగ్‌తో మాట్లాడటానికి మీడియా ప్రయత్నించగా మౌనంగా ఉన్నారు. ఇక బాధిత రాజా రఘువంశీ కుటుంబం తీవ్రంగా మండిపడుతోంది. బెయిల్ ఇవ్వడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని పేర్కొంది.