NTV Telugu Site icon

Jharkhand: హేమంత్ సోరెన్ vs చంపాయి సోరెన్.. బీజేపీ డబ్బుతో కొనాలని చూస్తుందన్న సీఎం..

Hemant Soren

Hemant Soren

Jharkhand: ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ ముక్తి మెర్చా(జేఎంఎం) సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చంపాయి సోరెన్ ఢిల్లీకి వెళ్లడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. తాను పార్టీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నట్లు చంపాయి పేర్కొనడం ఆయనా పార్టీ మారుతారనే వార్తలకు బలం చేకురుస్తుంది. తన ముందు మూడు దారులు- రాజకీయాల నుంచి విరమించుకోవడం, కొత్త పార్టీని స్థాపించడం, తనకు అండగా నిలిచేవారితో ప్రయాణించడం అని అన్నారు.

Read Also: CPI Narayana: బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది..

అయితే, ఈ పరిణామాలపై సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై ధ్వజమెత్తాడు. ‘‘ఇళ్లను విభజించి రాజకీయ పార్టీలను కూల్చే పనిలో బీజేపీ నిమగ్నమైందని విమర్శించారు. ఒకరోజు ఈ ఎమ్మెల్యేని కొంటారు, రేపు మరో ఎమ్మెల్యేని కొంటారు. డబ్బు ఉంటే నాయకులు పార్టీ మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ పర్వాలేదు, ఇండియా కూటమి ప్రభుత్వం 2019 నుంచి ప్రజలకు అండగా నిలుస్తుంది’’ అని ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

హేమంత్ సొరెన్‌, అతని కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతున్న చంపై సోరెన్, హేమంత్ సోరెన్ జైలులో ఉన్న సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత తనను అవమానకరంగా పదవి నుంచి దించారనే చంపాయి ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి వ్యక్తుల్ని తీసుకువచ్చి గిరిజన, దళిత, ఓబీసీ, మైనారిటీ వర్గాల్లో విషం వ్యాపింపజేస్తోందని విమర్శించారు.