కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆర్థికంగా కొన్ని కుటుంబాలు చితికిపోతే.. భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది.. తల్లిదండ్రులను, సంరక్షణలను కోల్పోయి వేలాది మంది చిన్నారులు అనాథలైన పరిస్థితి.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి.. మరోవైపు.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో ఎదురైన అనుభవాలతో థర్డ్ వేవ్ను ఎదర్కొనేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం లక్షమంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బందిని (హెల్త్ఆర్మీని) సిద్ధం చేస్తోంది.. దీనికోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కసరత్తు చేపట్టిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 194 జిల్లాల పరిధిలో ఉన్న 300 శిక్షణ కేంద్రాలను ఇప్పటికే గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్య సిబ్బంది సైపుణ్యాన్ని పెంచేలా ఓవైపు.. కొత్తవారికి శిక్షణ ఇచ్చేలా మరోవైపు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తంగా ఆరు రంగాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు గుర్తించినట్టు చెబుతున్నారు.. ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్, హోం కేర్ సపోర్ట్, అడ్వాన్స్ కేర్ సపోర్ట్, మెడికల్ ఎక్వీప్మెంట్ సపోర్ట్ లో శిక్షణ ఇవ్వనున్నారు.. ఇక, ఆక్సిజన్ వెంటిలేటర్లు, కాన్సన్ట్రేటర్లు వంటి వైద్యపరికరాలు ఉన్నా వాటిని వినియోగించుకోలేకపోతున్నామనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో 500 జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద పని చేయటానికి వీలుగా 20 వేల మంది ఐటీఐ పూర్తి చేసినవారికి కూడా శిక్షణ ఇస్తారు.. ఇక, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటికే కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ 2,25,000 మందికి ఆరోగ్యకార్యకర్తలుగాపని చేయటానికి వీలైన సమగ్రమైన శిక్షణనిచ్చింది. మరో లక్ష మందిని సిద్ధం చేయనున్నారు.