Hathras stampede: హత్రాస్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక ధార్మిక కార్యక్రమంతో కోసం ఎక్కువ సంఖ్యలో జనం హాజరుకావడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు. ఉత్తర్ప్రదేశ్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భోలే బాబాగా పిలువడే ఆధ్యాత్మిక గురువు కార్యక్రమానికి లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. 80 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది ప్రజలు వచ్చారు. భోలే బాబా పాదధూళి తీసుకునేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: BMW Car Accident: బీఎండబ్ల్యూ కార్ ఢీకొని మహిళ మృతి.. శివసేన నేత కుమారుడే ప్రధాన నిందితుడు..
ఇదిలా ఉంటే ఈ ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని భోలే బాబా ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత మరోసారి భోలే బాబా తరుపున ఆయన న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ తొక్కిసలాట పథకం ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. మతమరమైన కార్యక్రమంలో 10-12 మంది వ్యక్తులు విషం చల్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని న్యాయవాది ఏపీ సింగ్ ఆదివారం పేర్కొన్నారు. తొక్కిసలాట తర్వాత కుట్ర చేసినవారు అక్కడ నుంచి పారిపోయారని అన్నారు.
ఈ కుట్రలో మొత్తం 16 మంది పాల్గొన్నారని, కొన్ని గుర్తుతెలియని వాహనాలు తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఉన్నాయని, 10-12 మంది విషం చిమ్మడంతో మహిళలు ఊపిరితీసుకునేందుకు పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న దేవప్రకాష్ మధుకర్ని గత వారం సిట్ ముందు లొంగిపోయాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ (రిటైర్డ్) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల దర్యాప్తు ప్యానెల్ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు మధుకర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.