Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..

  • ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో కీలక మలుపు..
  • ట్రూడో ఆరోపణలకు ఎదురుదెబ్బ..
  • భారత ప్రమేయం లేదని కెనడా పోలీసుల స్పష్టీకరణ..
Nijjar

Nijjar

Nijjar killing:  ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య దౌత్యవివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో సర్రే ప్రాంతంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ టూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. కెనడా ఆరోపణలకు అంతే ధీటుగా భారత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లకు కెనడా ప్రధాన స్థావరంగా మారిందని విమర్శించింది.

ఈ నేపథ్యంలో, ఈ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ లిసా మోర్లాండ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో భారత ప్రభుత్వ అధికారులను ఈ కేసుతో అనుసంధానించే ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అయితే భారత ప్రభుత్వం కూడా ఈ విచారణకు సహకరిస్తోందని వెల్లడించారు.

మరోవైపు, అమెరికా న్యాయశాఖ తాజాగా ‘‘ఆపరేషన్ హార్డ్ బాల్’’ కింద దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణఓయ్, అతడి అనుచరుడు గోల్డీ బ్రార్ తదితరులపై నిజ్జర్ హత్యకు సంబంధించిన ఆరోపణలు నమోదు చేసింది. ఈ చార్జిషీట్‌లో కూడా భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని ఎక్కడ పేర్కొనలేదు.

నిజ్జర్ ఎవరు?

హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)‌కు అధినేతగా ఉన్నాడు. 2020లో ఇతడిని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2023లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల కారణంగా ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గురు పత్వంత్ సింగ్ పన్నూ వంటి కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, నిజ్జర్‌కు మద్దతుగా నిలిచారు. ఇక జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-కెనడా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి.