Hamid Ansari row: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ఏ.జీ నూరానీ స్మారక ఉపన్యాసంలో ఆయన దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ .. ‘‘భారతదేశానికి ముప్పు కమ్యూనిజం కాదని, హిందూ మితవాద మతతత్వమే’’ అని అన్నారు. ఏ.జి. నూరానీ 2019లో రాసిన ‘ది ఆర్ఎస్ఎస్: ఏ మెనస్ టు ఇండియా’ అనే పుస్తకంలోని ఒక ప్రస్తావన ఆధారంగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, వీహెచ్పీ తీవ్రంగా స్పందిస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. హమీద్ అన్సారీ తాను చేపట్టిన పదవి గౌరవాన్ని తీసేశారని, అతడి వ్యాఖ్యలు ఇండియాకు ప్రమాదకరమని, ఆయన వైఖరి యాంటీ-ఇండియాగా ఉందని వ్యాఖ్యానించారు.
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ కూడా అన్సారీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అన్సారీకి పదవులు, గౌరవాలు, అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు. మెజారిటీ హిందూ సమాజాన్ని దేశానికి ముప్పుగా ముద్ర వేయడం ఎలా సమర్థనీయం అని ప్రశ్నించారు. సమాజంలో మెజారిటీ-మైనారిటీ విభజన తేవాలనే మత ఛాందసవా మనస్తత్వం ఉన్నవారే సమాజానికి అసలైన ఆందోళన అని అన్నారు.
బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్సారీ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దురదృష్టకరమని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ముస్లింలు విద్యలో, పోటీ పరీక్షల్లో పురోగమిస్తున్నారని ఆయన అన్నారు. దేశం శాంతియుతంగా ఉందని, ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచించారు. మరో బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. సమాజంలో విభజన సృష్టించడానికి ప్రయత్నించే వారి రాజకీయాలు సఫలం కాదని అన్నారు.
బీజేపీ నేత కరుణాసాగర్ కూడా అన్సారీ వ్యాఖ్యల్ని ప్రశ్నించారు. సమస్య తీవ్రవాదం అయితే, వామపక్ష అతివాదం ,ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో కూడా ఇదే స్పష్టత ఉందా.? అని అడిగారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ సభ్యుడైన ఉమర్ అహ్మద్ ఇల్యాసీ కూడా అన్సారీ ప్రకటనను వ్యతిరేకించారు. ఇలాంటి ప్రకటనలు సామాజిక వాతావరణాన్ని కలుషితం చేయగలవని ఆయన ఆరోపించారు. ముస్లింలను రెచ్చగొట్టే ఏ ప్రకటనలనూ సమాజం తీవ్రంగా పరిగణించదని ఇల్యాసీ పేర్కొన్నారు.

