Hafiz Saeed: పహల్గామ్ ఉగ్ర దాడి కేసులో నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్పై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సయీద్పై ఎన్ఐఏ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. భారత్, అమెరికాలు సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. 2008 ముంబై ఉగ్రవాద దాడులకు కూడా ఇతే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు.
ఛార్జిషీట్ ప్రకారం, 76 ఏళ్ల హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా, దాని అనుబంధ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కు అధిపతిగా పేర్కొంది. ఇతడిపై భారతీయ న్యాయ సంహిత- 2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)-1967లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన సర్గోధా నివాసి అయిన హఫీజ్ సయీద్ పరారీలో ఉన్న నిందితుడని కోర్టు తెలిపింది. దీంతో కోర్టు అతడిపై ఓపెన్ డేటెడ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
గతేడాది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిపి 26 మందిని చంపేసింది. వీరిలో చాలా మంది పర్యాటకులు. ఈ ఘటన తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్లోని, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ భారత సాధారణ ప్రజలపై దాడులు చేయడానికి ప్రయత్నించడంతో, ఆ దేశ ఎయిర్ ఫోర్స్కు చెందిన కీలక స్థావరాలను భారత్ వైమానిక దాడిలో ధ్వంసం చేసింది.

