Gujarat Floods: గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు

  • గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు
  • నీళ్లల్లోనే పలు నగరాలు
  • హెలికాప్టర్లతో బాధితులకు సాయం
Rain

Rain

దేశంలో ఎల్‌నినో ప్రభావం వెంటాడుతున్న తరుణంలో గుజరాత్‌లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరాల్లోకి వరద అతలాకుతలం చేసింది. అహ్మదాబాద్, సూరత్‌, నవసారి, వల్సాద్, ఖేడా, తాపి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. నివాసాలు మునిగిపోయాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులే కాదు.. గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లు కూడా ముంపునకు గురయ్యాయి. అనేక చోట్ల జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు కూడా నీట మునిగాయి. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టింది. ఐదు హెలికాప్టర్లతో సహాయ చర్యలు అందిస్తున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణ గుజరాత్‌లోని పలు జిల్లాలు భయాందోళనలో ఉన్నాయి. నదులు, వాగులు, గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లు ముంపునకు గురయ్యాయి. అనేక చోట్ల జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. స్థానిక పోలీసులు, పరిపాలన యంత్రాంగంతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమైయ్యాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పరిస్థితిని అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

నవసారి, వల్సాద్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క వల్సాద్‌లోనే సుమారు 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వల్సాద్, దాని పొరుగున ఉన్న నవసారి జిల్లాల నుంచి కలిపి 22,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నవసారి, వల్సాద్ మినహా సూరత్, అహ్మదాబాద్, ఖేడా, తాపి, డాంగ్ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.

 

వల్సాద్ జిల్లాలోని ఉమర్‌గావ్ తాలూకాలో గత 36 గంటల్లో రికార్డు స్థాయిలో 1,200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధికారుల ప్రకారం.. ప్రభావిత జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు మోహరించాయి. అదనంగా సహాయక, రెస్క్యూ కార్యకలాపాల కోసం నవసారి, వల్సాద్ జిల్లాల్లో రెండు ఆర్మీ దళాలు మోహరించాయి. గాంధీనగర్‌లోని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ప్రకారం.. వల్సాద్ జిల్లాలోని ఉమర్‌గావ్ తాలూకాలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల వ్యవధిలో 1,200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ప్రభావిత జిల్లాలన్నింటిలో శుక్రవారం నుంచి పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి.. వర్ష ప్రభావిత జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.