Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

  • గోవాలో ఘోరం
  • రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్
  • తీవ్ర మనస్తాపానికి గురై డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
Goa

Goa

గోవాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. చెత్త వీడియో కారణంగా ఓ విద్యాకుసుమం నేల రాలిపోయింది. ఈ దుర్ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే…

23 ఏళ్ల శామ్యూల్ అనే యువకుడు గోవాలోని మపుసా ప్రాంతంలో నివసిస్తున్నాడు. తల్లి, ఇద్దరు సోదరీమణులతో నివసిస్తూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇటీవల ఉత్తర గోవాలోని ఓ రహదారి పక్కన శామ్యూల్ చెత్త వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అనంతరం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అంతేకాకుండా వ్యతిరేకంగా ట్రోలింగ్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై… మానసికంగా కృంగిపోవడంతో అర్ధాంతరంగా తనువు చాలించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

×
×
Ad

కేసు నమోదు.. పోలీసుల నోటీసు

వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు శామ్యూల్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. విచారణలో భాగంగా అతడు పోలీసుల ఎదుట హాజరై సహకరించినట్లు అధికారులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్, విమర్శలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తుపాకీతో కాల్చుకుని..

పోలీసుల వివరాల ప్రకారం.. కుటుంబానికి చెందిన లైసెన్సు కలిగిన తుపాకీతో శామ్యూల్ తనకు తానుగా కాల్చుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు వైరల్ వీడియో, పోలీసు కేసు, సోషల్ మీడియా ట్రోలింగే కారణమయ్యాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత శామ్యూల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. గత కొన్ని గంటలుగా అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

దర్యాప్తు కొనసాగుతోంది

అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి (Accidental Death) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైరల్ వీడియో తర్వాత జరిగిన పరిణామాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావం, విద్యార్థి మానసిక పరిస్థితి వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన సోషల్ మీడియా ట్రోలింగ్, ఆన్‌లైన్ విమర్శలు యువత మానసిక ఆరోగ్యంపై ఎంత తీవ్ర ప్రభావం చూపగలవో మరోసారి జాతీయంగా చర్చకు దారితీసింది.