Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు భారత పర్యటనలో లభించిన అపూర్వ స్వాగతం గురించి గుర్తు చేసుకున్నారు. 2023 భారత పర్యటనకు వెళ్లినప్పుడు న్యూఢిల్లీలో వీధులన్నీ తన ఫోటోలతో, స్వాగత సందేశాలతో నిండిపోయాయని, తిరిగి వెళ్లే సమయంలో అదే పోస్టర్లపై ‘‘వచ్చినందుకు ధన్యవాదాలు’’ అనే సందేశాలు కనిపించాయని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ అలెశాండ్రో సలుస్తి, మెలోనితో జరిగిన సంభాషణల్ని ‘‘జియోర్జియాస్ విజన్’’ పుస్తకంలో ప్రస్తావించారు.
ఆ సమయంలో ఇటలీ ఉప ప్రధానిగా ఉన్న ఆంటోనియో తజానీ, ఈ స్వాగతం గురించి మాట్లాడుతూ.. ‘‘మీరు న్యూఢిల్లీలో నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే లక్షలాది ఓట్లు వచ్చేవి’’ అని సరదాగా వ్యాఖ్యానించినట్లు మెలోని వెల్లడించారు. మెలోనీ 2023లో రెండుసార్లు భారత పర్యటనకు వచ్చారు. మార్చిలో జరిగిన రైసినా డైలాగ్ సమావేశంలో పాల్గొనగా, సెప్టెంబర్లో జీ20 సదస్సు కోసం మళ్లీ భారత్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో మంచి అనుబంధం ఏర్పడింది.
మోడీ-మెలోనీ కలిస్తే ఇంటర్నెట్లో వీరిద్దరి ఫోటోలు వైరల్ కావడం, ‘‘మెలోడీ’’ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ కావడం చూస్తున్నాం. ఇటీవల ప్రధాని ఇటలీ పర్యటనలో జార్జియా మెలోనీకి మోడీ ‘‘మెలోడీ’’ చాక్లెట్లు బహూకరించారు. మెలోడీ, మోడీ కలిసి ఒకరినొకరు అభినందించుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది.

