దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తొలుత ముగ్గురు అక్కాచెల్లెళ్లు ‘‘కొరియన్ లవ్ గేమ్’’కు బానిసై 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో తండ్రి చేతన్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లోని సాహిబాబాద్ ప్రాంతంలోని భారత్ సిటీలో చేతన్ కుమార్ నివాసం ఉంటోంది. 3 BHK ఫ్లాట్లో కుటుంమంతా ఉంటోంది. 3 BHKలో 3 ఫ్లాట్లు ఉండగా కుటుంబమంతా ఒకే గదిలో పడుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. చేతన్ కుమార్కు ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు ఆడపిల్లలు కాగా.. ఒక కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ముగ్గురు బాలికలు ఒకేసారి బయటకు ఎలా వెళ్లారని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా శబ్దం చేయకుండా బయటకు వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి. ఇది సాధారణమా? లేదంటే కుటుంబ ఉదాసీనత? అనేది తేలాల్సి ఉంది.
చేతన్ కుమార్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నట్లు ఒప్పకున్నాడు. 2010లో మొదటి వివాహం సుజాతతో జరిగింది. రెండో వివాహం 2013లో హినాతో జరిగింది. మూడో వివాహం 2018లో టీనాతో జరిగింది. మొదట్లో టీనా భార్య కాదని అబద్దాలు చెప్పాడు. గట్టిగా విచారించగా టీనా భార్య అని ఒప్పుకున్నాడు. టీనా వయసు 22 సంవత్సరాలు. ఈమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం చేతన్ వాంగ్మూలాలు పదే పదే మారుస్తున్నాడు. దీంతో అతడి చెప్పే మాటలను పోలీసులు విశ్వసించలేకపోతున్నారు. ఇక వివాహాలకు సంబంధించిన పత్రాలు చూపించమంటే చూపించలేకపోతున్నాడు. భార్యలు కూడా కచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మొదటి ఇద్దరు భార్యలు నిరక్షరాస్యులుగా గుర్తించారు. దేవాలయాలు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగానే బాలికల మానసిక ఆర్యోగంపై తీవ్ర ప్రభావం చూపించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు
ఇక ముగ్గురు అక్కాచెల్లెళ్లు చాలా ఏళ్ల నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. ఆర్థిక పరిస్థితులు కారణంగా ఇంటికే పరిమతం అయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో చాలా గందరగోళం నెలకొన్నట్లుగా పోలీసులు ఒక ఆలోచనకు వచ్చారు. ఇక దర్యాప్తులో అమ్మాయిల దగ్గర రెండు మొబైల్స్ ఉన్నట్లుగా కనిపెట్టారు. అప్పుల కారణంగా రెండు ఫోన్లు చేతన్ కుమార్ అమ్మేశాడు. ఒకటి ఆరు నెలల క్రితం.. ఇంకొకటి 15 రోజుల క్రితం అమ్మేశాడు. ప్రస్తుతం ఆ రెండు ఫోన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్లను ఫార్మాట్ చేసి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
చేతన్ కుమార్ గతంలో క్రెడిట్ కార్డు బ్రోకర్గా పని చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతని ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఇంట్లో చాలా ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయి. అద్దె, పిల్లల ఖర్చులు, రోజు వారీ అవసరాలు ఏదోలాగా గడిచిపోతున్నాయి. ఈ వాతావరణం బాలికలపై తీవ్ర ప్రభావం చూపించినట్లుగా పోలీసులు భావిస్తు్న్నారు. ఓ వైపు పాఠశాలకు వెళ్లకపోవడం.. ఇంటికే పరిమితం కావడం.. ఇవన్నీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కచ్చితంగా ఇది ఆత్మహత్య కాకపోవచ్చని.. పరిస్థితుల కారణంగా జరిగి ఉండొచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
