AC: వేసవి ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరిగిపోతున్నాయి. ప్రజలు ఈ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీలను వాడుతున్నారు. ఒకప్పుడు ఏసీలు అంటే డబ్బున్న వారు మాత్రమే వాడే ఒక మిషన్గా ఉండేది. ప్రస్తుతం అందరికి ఏసీలు అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా ఏసీల వినియోగం పెరిగింది. పదుల సంఖ్యలో ఏసీ కంపెనీలు మంచి ఆఫర్లు, ఫీచర్లతో కస్టమర్లను ఊరిస్తున్నాయి.
అయితే, ఇండియాలో ఎయిర్ కండిషనర్లు(ఏసీ) వినియోగం ఎప్పుడు ప్రారంభమైందనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. దేశంలో తొలి ఏసీని ఎక్కడ వినియోగించుకున్నారు.? ఎవరు వాడారు.? అని చాలా మంది తెలుసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి భారత్లో మొదటి ఏసీ వినియోగం 1936లో జరిగింది. జైపూర్లోని ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్లో మొదటి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనినే భారత్లో మొట్టమొదటి ఏసీ ఏర్పాటుగా పరిగణిస్తారు. జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్ మహారాజుగారి నివాసం. ప్రముఖ అమెరికన్ కంపెనీ క్యారియర్ ఈ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనితోనే భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషనింగ్ వినియోగం ప్రారంభమైంది. దేశంలో ఏసీ విప్లవానికి నాంది జైపూర్లోనే పడింది.
