FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?

  • పార్లమెంటరీ కమిటీకి FCRA బిల్లు..
  • కీలక నిర్ణయం తీసుకునే దిశగా మోడీ సర్కార్..
  • బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు..
Parliament Monsoon Session

Parliament Monsoon Session

FCRA Amendment Bill: వివాదాస్పద విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026 (FCRA Amendment Bill 2026)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన తర్వాత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు తలెత్తడంతోనే జేపీసీ ఆలోచనకు కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోన్ని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు, ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు ప్రస్తావనకు రాలేదు. ప్రభుత్వం ఈ రెండు బిల్లులను సమావేశ ఎజెండాలో చేర్చలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వర్షాకాల సమావేశాలు ముగియడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ రెండు బిల్లులను సభ ముందుకు ఎప్పుడు తీసుకువస్తారనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి.

ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే ఇటీవల ఈ బిల్లును వ్యతిరేకించారు, బిల్లును విత్ డ్రా చేసుకోవడం లేదా జేపీసీకి పంపాలని డిమాండ్ చేశారు. విదేశీ నిధుల్ని ఎల్లప్పుడూ అనుమానంతో చూడకూడదని ఆమె అన్నారు. ఇలాంటి చట్టాలపై విస్తృతంగా చర్చించి, సమగ్ర పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరోవైపు డీఎంకే కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ ఎంపీ పి విల్సన్ ప్రతినిధి బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి బిల్లును ఉపసంహరించుకోవాలని కోరింది. ప్రస్తుత ఎఫ్‌సీఆర్ఏ చట్టంలోని సెక్షన్ 15ను తొలగించాలని డీఎంకే డిమాండ్ చేసింది. కాంగ్రెస్, ఎస్పీ, వామపక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి.