JEE: సాధారణ కుటుంబాలు, పేదరిక నేపథ్యం కలిగిన వ్యక్తులు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఇలాంటి వారు అనేక మంది ర్యాంకులు సాధించారు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్లో కూడా ఇలాంటి నేపథ్యం ఉన్న బిడ్డలు మెరిశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మహారాష్ట్ర వాషిం జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు బిడ్డ నీలకృష్ణ గజారే జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ సాధించారు.
READ ALSO: Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
గత రెండేళ్లుగా పట్టుదల, కృషి ఈ ర్యాంక్ సాధించేలా చేసిందని అతను చెప్పాడు. వాషిం జిల్లాలో మారుమూల గ్రామం బెల్ఖేడ్కి చెందిన నీల్కృష్ణ పరీక్ష కోసం ప్రతీరోజు 10 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించాడు. నీల్కృష్ణ తండ్రి నిర్మల్ గజరే మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని అన్నారు. నీల్కృష్ణ తన ప్రాథమిక విద్యను అకోలాలోని రాజేశ్వర్ కాన్వెంట్, వాషిమ్లోని కరంజా లాడ్లోని జెసి హైస్కూల్లో చదివాడు. ఆ సమయంతో తన అత్త ఇంట్లో ఉండీ విద్యాభ్యాసం కొనసాగించాడు.
నీల్ కృష్ణ అద్భుతమైన విద్యార్థి అని, క్రీడల్లో నిష్ణాతుడని, ఆర్చరీలో జిల్లా, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నడాని అతని తండ్రి నిర్మల్ తెలిపారు. ఉదయం 4 గంటలకు లేచి రెండు గంటలు చదువుకుని, మళ్లీ ఉదయం 8.30 గంటల నుంచి చదవడం ప్రారంభించి రాత్రి 10 గంటలకు నిద్ర పోయేవాడని నిర్మల్ వెల్లడించారు. తాను ఎప్పటికీ సాధించలేని వాటిని తన కొడుకు సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. నీల్కృష్ణ ఐఐటీ బాంబేలో చదువుకోవాలని, సైంటిస్ట్గా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న JEE-అడ్వాన్స్డ్కు సిద్ధమవుతున్నాడు.