తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు సాక్షాలు కావాలా? అసలు నువ్వు భారతీయుడివా? అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ సరిహద్దుల గురించి మాట్లాడిన తీరును డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆమె ప్రకటన విడుదల చేశారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడడం దురదృష్టకరమని, ఎన్నికల సమయంలో సరిహద్దుల్లో అలజడులు రేగుతున్నాయని కేసీఆర్ ప్రకటించడం శత్రు దేశాల వాదనకు బలం చేకూర్చడమే అవుతుందని అన్నారు. భారత ఆర్మీ ఛీఫ్ , వాయుసేన ఛీఫ్ సర్జికల్ స్ట్రైక్ పై ప్రకటన విడుదల చేశాక ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు.
బాధ్యతాయుతమయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి పాకిస్థాన్ మంత్రి అడిగినట్లుగా సర్జికల్ స్ట్రైక్ కు సాక్ష్యాధారాలు అడగడం కేసీఆర్ దిగజారుడు రాజకీయమే అవుతుందని డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం ,జాతీయ స్థాయిలో చిన్న స్థానం కోసం రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతుగా ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా మాట్లాడడం టీఆర్ఎస్, కేసీఆర్ థర్డ్ క్లాస్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు.
బిపిన్ రావత్ పై ఈరోజు కపట ప్రేమ చూపెడుతున్న కేసీఆర్ , కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ రావత్ ని అసభ్యంగా దూషించినప్పుడు ఎందుకు ప్రగతి భవన్ లో నిశ్శబ్దంగా ఉన్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేసారు. రాజకీయాల కోసం గోబెల్స్ ప్రచారాలు చేస్తున్న కేసీఆర్ కళ్ళకు బిపిన్ రావత్ పార్థివ దేహన్ని తమిళ నాడు నుండి తరలిస్తుండగా తమిళ ప్రజలు జాతీయ జెండాను చేతపట్టుకుని రహదారుల వెంట నివాళులు అర్పించిన సంగతి కనిపించలేదా ? జాతీయ జెండా నీకు బీజేపీ జెండాగా కనిపించిందా? అన్నారు.
కొత్త రాజకీయ పార్టీ పెట్టుకో ,లేకుంటే కొత్త ఫ్రంటో ,టెంటో పెట్టుకో కానీ దేశ భద్రతను తాకట్టుపెట్టేలా , పాకిస్థాన్ ప్రకటనలకు బలం చేకూర్చేలా ,భారత ప్రభుత్వం ను అబాసుపాలు చేసేలా ఇంకోసారి మాట్లాడితే నీకు తగిన శాస్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీని తట్టుకోలేక ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చలేక రోజుకో వేషం వేస్తూ రాజ్యాంగం గురించి, భారత సైన్యం గురించి ఇష్టారీతిన మాట్లాడడం నీ పతనానికి నాంది అన్నారు. నీ పిచ్చి ప్రేలాపనలతో, బీజేపీ కార్యకర్తలపై దాడులతో అధికారాన్ని కాపాడుకుంటానని భావించడం నీ అవివేకమే అవుతుందని డీకే అరుణ ముఖ్యమంత్రి తీరును దుయబట్టారు.