Amritpal Singh: యాంటీ టెర్రర్ చట్టం కింద అమృత్‌పాల్ సింగ్ నిర్బంధం మరో ఏడాది పొడగింపు..

  • ఖలిస్తానీ అమృ‌త్‌పాల్ సింగ్‌కి షాక్..
  • మరో ఏడాది నిర్బంధం పొడగింపు..
  • ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా గెలుపు..
  • దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్..
Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని మరో ఏడాది పొడగించారు. అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అతడిని జాతీయ భద్రతా చట్టం కింద మరో ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు. సింగ్‌తో పాటు మరో తొమ్మిది మంది నిర్బంధాన్ని ఈ రోజు నుంచి మరో ఏడాది పాటు పొడగించారు. అమృత్‌పాల్‌ని గతేడాది మార్చిలో అరెస్ట్ చేసి, జైలులో ఉంచారు. అతడితో పాటు ముగ్గురు అనుచరులు నిర్బంధం గడువు జూలై 24తో ముగుస్తుంది. మరో అరుగురు సహచరుల నిర్బంధం జూన్ 18తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వీరందరి నిర్బంధాన్ని యాంటీ టెర్రర్ చట్టం ప్రకారం మరో ఏడాది పొడగించింది కేంద్రం.

Read Also: Actor Darshan case: రేణుకా స్వామిని చంపేందుకు 17 మంది కుట్ర.. దర్శన్ కేసులో సంచలన విషయాలు..

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అమృత్‌పాల్ సింగ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జారాపై 1,97,120 ఓట్లతో గెలుపొందారు. 1984లో గోల్డెన్ టెంపుల్ వద్ద భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన వేర్పాటువాద నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను అమృతపాల్ సింగ్ స్ఫూర్తిగా భావించారు. అరెస్టుకు ముందు రెచ్చగొట్టే ప్రసంగాలతో పాటు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తప్పించుకుని విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అరెస్ట్ చేసి దిబ్రూగఢ్ జైలులో ఉంచారు.