Dengue Vaccine : భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో మైలురాయిగా నిలిచే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘డెంగిఆల్’ పేరుతో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్ల నుంచి రక్షణ కలిగించే లైవ్-అటెన్యూయేటెడ్ టీకా కావడం విశేషం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్లో అక్టోబర్ నాటికి దాదాపు 10,500 మంది వాలంటీర్లను నమోదు చేసే లక్ష్యం ఉంది. ఇప్పటికే పూణే, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, భువనేశ్వర్ సహా ఇతర నగరాల్లోని కేంద్రాల్లో 8,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. టీకా లేదా ప్లేసిబో ఇవ్వడమూ ఇందులో భాగం.
AI Heros: మన హీరో హీరోయిన్లు ఇలా అయిపోతే.. అమ్మో.. ఆ ఊహే భయంకరం!
ఈ ట్రయల్స్ను పూణేలోని ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో డెంగ్యూ వ్యతిరేకంగా లైసెన్స్ పొందిన ఏ టీకా అందుబాటులో లేనందున ఇది ఎంతో కీలకం.
డాక్టర్ మనోజ్ ముర్హేకర్ (NIE డైరెక్టర్) ప్రకారం, మొదటి, రెండో దశల ట్రయల్స్లో భద్రతాపరమైన ఎలాంటి సమస్యలు కనిపించలేదు. మూడో దశ ట్రయల్లో టీకా తీసుకున్నవారిని రెండేళ్లపాటు పర్యవేక్షించి, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అంచనా వేస్తారు.
2023లో ప్రారంభమైన ఈ మల్టీసెంటర్, డబుల్-బ్లైండ్, రాండమైజ్డ్, ప్లేసిబో నియంత్రిత ట్రయల్ తొలిగా రోహ్తక్లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ PGIMSలో ప్రారంభమైంది. ఈ టెట్రావాలెంట్ స్ట్రెయిన్ (TV003/TV005) అమెరికాలో అభివృద్ధి అయింది. ఇది బ్రెజిల్లో ట్రయల్స్లో మంచి ఫలితాలు చూపినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పనాసియా బయోటెక్ ఈ స్ట్రెయిన్ ఆధారంగా పూర్తి స్థాయి ఫార్ములేషన్ అభివృద్ధి చేస్తూ, ప్రాసెస్ పేటెంట్ను కూడా పొందింది.
డెంగ్యూ భారతదేశంలో ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతోంది. WHO ప్రకారం 2023 చివరినాటికి 129 దేశాల్లో డెంగ్యూ వ్యాప్తి ఉందని నివేదికలు వెల్లడించాయి. భారత్ టాప్ 30 దేశాల్లో ఒకటిగా ఉండగా, ఇక్కడి కేసులలో 75-80 శాతం లక్షణాలు లేకుండానే ఉంటాయి. అయినా దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి అవకాశముంటుంది. పిల్లల్లో ఆసుపత్రి పాలవడం, మరణాలు నమోదు కావడం గమనార్హం. పెద్దవారిలో అయితే డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్, షాక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.
2024లో ఇప్పటివరకు 2.3 లక్షల కేసులు, 297 మరణాలు నమోదవ్వగా, మార్చి వరకు మాత్రమే 12,000కి పైగా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డెంగిఆల్ వ్యాక్సిన్ భారతదేశానికి ఓ కీలక దిశను చూపనుంది.
ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే, దేశీయంగా అభివృద్ధి అయిన తొలి టెట్రావాలెంట్ డెంగ్యూ టీకాగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. దీని ద్వారా డెంగ్యూ నియంత్రణలో భారత ఆరోగ్య రంగం కొత్త దశలోకి అడుగుపెడుతుందన్న ఆశలు వెల్లువెత్తుతున్నాయి.
Samsung History: ఏంటి! శాంసంగ్ కంపెనీ మొదట్లో ఎండు చేపలు అమ్మిందా..? సంచలన విషయాలు…
