Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. పాక్‌ కోసం బంగ్లాదేశీయుల గూఢచర్యం..

Terroe Bust

Terroe Bust

Tamil Nadu: దేశంలో భారీ ఉగ్రకుట్న భగ్నమైంది. తమిళనాడులో 8 మంది అనుమానితుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. వీరంతా లష్కరే తోయిబా మాడ్యుల్‌కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కోసం పనిచేస్తున్నట్లు, వారి తరుపున భారతదేశంలో గూఢచర్యం చేస్తున్నట్లు తేలింది. ఐఎస్ఐ, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల ఆదేశాల మేరకు ఉగ్రవాద దాడులకు ఈ మాడ్యుల్ ప్రణాళిక రచిస్తోంది. ఆపరేషన్ సమయంలో పోలీసులు నిందితుల దగ్గర నుంచి 12కు పైగా మొబైల్స్, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నిందితులు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఢిల్లీ, కోల్‌కతాలోని మెట్రో స్టేషన్లలో ఉగ్రవాది బుర్హాన్ వానిని, పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను పొగుడుతూ పోస్టర్లు వేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అడిషనల్ సీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ఈ పోస్టర్లు కోల్‌కతా నుంచి ఢిల్లీకి వచ్చాయని దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 7న ఢిల్లీలో, ఫిబ్రవరి 10న కోల్‌కతాలో ఈ పోస్టర్లు వెలిశాయి.

Read Also: Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్‌చాట్ వైరల్

ఈ కేసులో ఇద్దరు నిందితులను కోల్‌కతాలో, ఆరుగురిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్ నుండి అరెస్టయిన ఆరుగురిని మిజానూర్ రెహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్వల్‌గా గుర్తించారు. వీరందరూ తిరుప్పూర్‌లోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరు తమ ఐడెంటిటిని దాచడానికి నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అరెస్టయిన 8 మందిలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులు. తమిళనాడు నుంచి అరెస్టయిన ఆరుగురు నిందితులు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు సాయం చేయడానికి వివిధ నగరాల్లో నిఘా నిర్వహిస్తున్నట్లు తేలింది.

ఈ ఉగ్రవాద మాడ్యుల్ నిర్వాహకుడు షబ్బీర్ అహ్మద్ లోన్ అలియాస్ షబ్బీర్ షా పాకిస్తాన్‌లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెట్వర్క్ నిర్వహిస్తున్నాడు. షబ్బీర్ అహ్మద్ లోన్ 2007లో ఢిల్లీలో అరెస్టయ్యాడు. 2017-18లో శిక్ష ముగిసిన తర్వాత అతను దేశం విడిచిపారిపోయాడు. లష్కరే తోయిబాలో చేరాడు. ఈ ఉగ్రవాదులు కోల్‌కతాలో ఖరీదైన ఫ్లాట్ అద్దెకు తీసుకుని తమ స్థావరంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల మొబైల్ ఫోన్స్ నుంచి అనేక నిఘా వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తేలింది.

Exit mobile version