Israel Embassy: ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం ఇరాన్ వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం ఇరాన్ని తలదించుకునేలా చేసింది. ఈ హత్యకు ఇజ్రాయిల్ కారణమని ఇరాన్తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లాలు ఆరోపించాయి. అయితే, ఈ దాడిపై ఇజ్రాయిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళన చెందుతోంది.
Read Also: Heart transplant: ‘‘ఆ గుండె వేగం ఎంతంటే 13 నిమిషాల్లో 18 కి.మీ.’’..
ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఎంబీసీతో పాటు చాబాద్ హౌజ్ భద్రతను సమీక్షించారు. ఢిల్లీలోని రెండు ఇజ్రాయెల్ భవనాల చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ప్లాన్ చేయడానికి భద్రతా బలగాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు భవనాల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్టీ లేయర్ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించవచ్చని అధికారులు తెలిపారు.
గత మూడేళ్లలో, దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరిగాయి. రెండు దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు.గత ఏడాది ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం మొదలవ్వడంతో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను పెంచారు.