Site icon NTV Telugu

IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!

Irs Officer Daughter Murder

Irs Officer Daughter Murder

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో నిందితుడు రాహుల్ మీనాను గురువారం కోర్టులో హాజరు పరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడు రాహుల్ మీనాలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని.. గంటల వ్యవధిలోనే ఇద్దరి మహిళలపై అత్యాచారం చేశాడని వెల్లడించారు. దర్యాప్తులో పదే పదే నిందితుడు వాంగ్మూలాలు మార్చేడని పేర్కొన్నారు. నిందితుడి మనస్తత్వం చాలా క్రూరంగా ఉందని తెలిపారు. రాహుల్ మీనా నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

పోలీసులు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడు రాహుల్ మీనా.. మంగళవారం పరిచయం ఉన్న స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడని.. ఆమెతో ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండేవాడని.. ఈ క్రమంలో ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పారు. ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఈ కేసు దర్యాప్తుపై కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఆ ఘటన తర్వాత ఢిల్లీకి ఎలా వచ్చావని అడిగితే తొలుత అంబులెన్స్‌లో వచ్చానని అబద్దం చెప్పాడని.. గట్టిగా నిలదీయగా మొబైల్ అమ్మిన డబ్బుతో క్యాబ్ బుక్ చేసుకుని ఢిల్లీకి వచ్చినట్లుగా చెప్పాడని వివరించారు.

8 నెలల కిందట ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పని చేశాడని.. అక్కడ విషయాలు పూర్తిగా తెలుసు అని.. ఈ క్రమంలోనే ఇంటి తాళాలు ఎక్కడ ఉంటాయో.. అధికారి ఎప్పుడు బయటకు వెళ్తాడన్న విషయం నిందితుడికి తెలుసు అన్నారు. ఉదయాన్నే అధికారి భార్యతో కలిసి జిమ్‌కు వెళ్లిపోగానే.. అదనపు తాళపు చెవితో ఇంట్లోకి ప్రవేశించి.. నేరుగా యువతి చదువుకుంటున్న స్టడీ రూమ్‌కు వెళ్లిపోయాడని.. ఆమెపై మొబైల్ కేబుల్‌తో గొంతు నులిమి.. అనంతరం బరువైన ఆయుధం దాడి చేయగానే స్పృహ తప్పిపోగానే అత్యాచారం చేశాడని.. అనంతరం లాకర్ ఓపెన్ చేసేందుకు రక్తపు మడుగులో ఉన్న యువతిని మెట్ల కిందకు ఈడ్చుకెళ్లాడని.. వేలిముద్రతో లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదన్నారు. అనంతరం స్కూడ్రైవర్‌తో లాకర్ ఓపెన్ చేసి నగలు, నగదు దొంగిలించాడని వివరించారు. రక్తపు మరకులు ఉన్న బట్టలు మార్చుకుని తల్లిదండ్రులు ఇంటికి వచ్చే 30 నిమిషాల ముందు వెళ్లిపోయాడని తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు ఇంట్లో ఉన్నాడని.. ఉదయం 6:30కి కాలనీలోకి ప్రవేశించగా.. 6:49 గంటలకు ఇంట్లోకి రహస్యంగా వెళ్లాడని.. ఉదయం 7:20కి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వివరించారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు కుమార్తె బట్టలు పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయని.. రక్తపు మడుగులో ఉందని తెలిపారు.

పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. ముక్కు ఎముక విరగడంతో పాటు రెండు చేతులు, అరచేతులు, కాళ్లపై అనేక గాయాలు ఉన్నాయని.. కమిలిన గాయాలు కూడా ఉన్నాయని.. ప్రతిఘటన జరగడంతో ఇలా జరిగి ఉంటుందని రిపోర్ట్‌లో తేలింది. కండరాలకు తీవ్ర నష్టం జరిగినట్లుగా వచ్చింది. గొంతు నొక్కడం వల్ల అంతర్గత అవయవాలకు రక్తప్రసరణ ఆగిపోయిందని గుర్తించారు. గొంతు నొక్కడం వల్లే చనిపోయిందని నివేదికలో వచ్చింది.

నిందితుడి నుంచి ఫోన్, నగలు, నగదు, ఇంకా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ హత్యలో ఇతర వ్యక్తుల ప్రమేయం లేదని.. ఒక్కడే చేశాడని చెప్పారు. కస్టడీలో నిందితుడి డీఎన్‌ఏ సేకరిస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. తాజా పరిణామాలను చూస్తుంటే గేటెడ్ కమ్యూనిటీ భద్రతాపై అనుమానాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

Exit mobile version