Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన

  • ఢిల్లీలో జనం ఊపిరాడక చనిపోవాల్సి వస్తోంది..
  • దేవుడే అందర్నీ కాపాడాలి..
  • ఢిల్లీలో ఇప్పటికే పచ్చదనం (గ్రీన్ స్పేస్) తగ్గిపోతుంది..
  • ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన
Delhi High Court

Delhi High Court

Delhi High Court: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చని ప్రదేశాలు వేగంగా తగ్గిపోతున్నాయని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) పరిధిలో మిగిలి ఉన్న కొద్దిపాటి గ్రీన్ స్పేస్‌లను కూడా స్వాధీనం చేసుకుంటే, భవిష్యత్తులో ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని జిమ్ఖానా క్లబ్, పోలో గ్రౌండ్ సహా పలు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. పోలో అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా, ఇప్పటికే ఢిల్లీలో పచ్చదనం గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితిని కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా ఎన్‌డీఎంసీ పరిధిలో ఉన్న కొద్దిపాటి పచ్చని ప్రదేశాలు నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించే ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్నాయని పేర్కొంది. అలాంటి ప్రాంతాలను కూడా ఇతర అవసరాల కోసం వినియోగిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. స్వాధీనం చేసుకోబోయే భూములపై ఎత్తైన భవనాలు లేదా ఇతర భారీ నిర్మాణాలు చేపట్టే ఆలోచన ఉందా అని ప్రశ్నించింది. పచ్చని ప్రదేశాలు తగ్గిపోతే నగరంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ప్రజల జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది.

×
×
Ad

“ఎన్‌డీఎంసీ పరిధిలో ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు మిగిలి ఉన్న కొద్దిపాటి స్థలాలు కూడా కనుమరుగైతే, భవిష్యత్తులో అందరం ఊపిరాడక ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేవుడే అందర్నీ కాపాడాలి” అంటూ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసినట్లు విచారణ సందర్భంగా వెల్లడైంది. ఈ కేసుపై తదుపరి విచారణలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని కోర్టుకు వివరించే అవకాశం ఉంది. రాజధానిలో పచ్చదనం పరిరక్షణ, నగరాభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న అంశంపై ఈ కేసు కీలకంగా మారే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.