Site icon NTV Telugu

Cricket Match Dispute: క్రికెట్‌ మ్యాచ్‌లో గొడవ.. 15 ఏళ్ల ఆటగాడిని చంపేశారు..

Cricket Match Dispute

Cricket Match Dispute

Cricket Match Dispute: ఢిల్లీలో ఆటస్థలం రణరంగంగా మారింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిలక్ నగర్ జిల్లాలోని వుడ్‌ల్యాండ్ పార్క్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 23, రాత్రి 7:22 గంటల సమయంలో తిలక్ నగర్‌లోని వుడ్‌ల్యాండ్ పార్క్‌లో కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడికి, 15 ఏళ్ల మరో బాలుడికి మధ్య మాటా మాటా పెరిగి గొడవ మొదలైంది. తొలుత సాధారణ వాగ్వాదంగా ప్రారంభమైన ఈ వివాదం.. చివరికి ప్రాణాంతక దాడిగా మారింది.

అయితే, తొలి గొడవ తర్వాత, 12 ఏళ్ల బాలుడు ఇంటికి వెళ్లి తన బంధువులైన మరో ఇద్దరు మైనర్లకు (17, 13 ఏళ్లు) జరిగిన విషయం చెప్పాడు. ఆగ్రహంతో ముగ్గురూ కలిసి 15 ఏళ్ల బాలుడి కోసం పార్క్ ప్రాంతంలో వెతికారు. బాధితుడు కనిపించగానే ముగ్గురు కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి సమయంలో బాధితుడి మెడ, తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. దెబ్బల ధాటికి అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు మరియు కుటుంబ సభ్యులు అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులైన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇక, జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అయితే, మృతుడు ఒక టీ వ్యాపారి కుమారుడు. నలుగురు సోదరులలో మూడవవాడైన ఈ బాలుడు ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version