దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. బ్రిక్స్లో సభ్య దేశాధినేతలంతా హస్తినకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీవీఐపీ జోన్లో ఉంది. నగరమంతా సందడి.. సందడిగా ఉంది. ఇలాంటి తరుణంలో వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. శని, ఆదివారాల్లో కీలక సమావేశాలు జరగనున్న తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది.
ఢిల్లీ, యూపీ, బీహార్ సహా 12 రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్-ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వరకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు వాయువ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. రేపు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్షం కురవనుంది. వారాంతంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో రెడ్ అలర్ట్
ఢిల్లీ-ఎన్సీఆర్లో శుక్రవారం అనేక ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం కూడా ఢిల్లీలో వర్షం కురుస్తుందని అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల పాటు ఆదివారం వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

