Defamation Case: పరువు నష్టం కేసులో నేడు సుల్తాన్‌పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ..

  • పరువునష్టం కేసులో ఎంపీ– ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టుకు రాహుల్..
  • నేడు ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ..
  • కోర్టు తీర్పు పై కొనసాగుతున్న సర్వత్రా ఉత్కంఠ..
Rahul

Rahul

Defamation Case: పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ (శుక్రవారం) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని​ సుల్తాన్ పూర్ లోని ఎంపీ– ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు రాహుల్ లక్నో ఎయిర్ పోర్టుకు నుంచి సుల్తాన్​పూర్ వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2018లో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సుల్తాన్ పూర్ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా పెట్టారు. ఈ కేసులో రాహుల్ కు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, విచారణలో భాగంగానే ఆయన కోర్టుకు హాజరు కానున్నారు.

Read Also: MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..

అయితే, ఐదు నెలల వ్యవధిలో రాహుల్ గాంధీ రెండోసారి సుల్తాన్ పూర్ కోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు, లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో అమేథీ, సుల్తాన్‌పూర్‌ నుంచి ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇక, పరువునష్టం కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా రాహుల్ వచ్చిన 20 నిమిషాల్లో ప్రక్రియ పూర్తయింది. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, కార్యకర్తల నినాదాల మధ్య చిరునవ్వులు చిందిస్తూ ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.