Lalu Prasad Yadav: నాన్నకు ప్రేమతో.. లాలూప్రసాద్‌ యాదవ్‌కు కూతురు కిడ్నీ దానం..

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

నాన్న గురించి.. నాన్న గొప్పతనం గురించి.. నాన్నపై పిల్లలు చూపించే ప్రేమ గురించి సినిమాలు వచ్చాయి.. ఎన్నో పాటలు, పాఠాలు వచ్చాయి.. సోషల్‌ మీడియాలో అయితే.. ఎన్నో రకాల కవితలు, కథనాలు కూడా దర్శమిస్తుంటాయి.. అయితే, నిజ జీవితంలో నాన్నపై ప్రేమ చూపించేవారు ఎంత మంది? ఈ రోజుల్లో వారికి చేదుడు వాదుడుగా ఎవరు ఉంటున్నారు? అంటే మాత్రం.. అంతా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.. అయితే, తాను అలా కాదు.. మా నాన్న కోసం ఏదైనా చేస్తాను అంటున్నారు బీహార్‌ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య.. గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. నివేదికల ప్రకారం, అక్టోబర్‌లో సింగపూర్ పర్యటనలో ఆర్జేడీ చీఫ్ కిడ్నీ మార్పిడి చేయాలని సింగపూర్‌లోని వైద్యులు సలహా ఇవ్వడంతో రోహిణి తన కిడ్నీ తండ్రికి దానం చేయడానికి ముందుకొచ్చింది.

Read Also: 100 Years Old Voters: భారత్‌లో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది

అయితే, లాలూ ప్రసాద్ మొదట రోహిణి తన కిడ్నీని దాసం చేస్తానంటే తీసుకోవడానికి ఇష్టపడలేదట.. కానీ, ఆమె ఒత్తిడి మరియు కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో.. చివరకు ఆయన అంగీకరించినట్టు సమాచారం.. నవంబర్ 20-24 మధ్య మరోసారి లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉందని, ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగపూర్‌లో ఉన్న లాలూ రెండవ కుమార్తె రోహిణి తన తండ్రి కిడ్నీ వ్యాధుల గురించి చాలా ఆందోళన చెందారు.. కిడ్నీ మార్పిడికి సలహా ఇచ్చిన వైద్యుల బృందాన్ని సంప్రదించడానికి లాలూ సింగపూర్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.. అయితే, గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూకు ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి చేయమని సలహా ఇవ్వలేదు.. కానీ, సింగపూర్ పర్యటనలో అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.. ఇక, రోహిణి, సింగపూర్‌లో ఉన్నప్పటికీ, బీహార్‌లోని రాజకీయ సంఘటనలను నిశితంగా గమనిస్తూ ఉంటారు.. తన రాజకీయ అభిప్రాయాన్ని వినిపించడానికి మరియు ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇవ్వడానికి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారామె. మొత్తంగా నాన్నపై తనకు ఉన్న ప్రేమను ఇలా చాటుకోబోతున్నారు రోహిణి.