Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే

  • రోజుకు రూ.400 సంపాదన..
  • కానీ ఖాతాలో రూ.41 కోట్ల లావాదేవీలు
  • కూలీకి ఐటీ శాఖ షాకింగ్ నోటీసు
Income Tax Notice

Income Tax Notice

Income Tax Notice: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఓ సాధారణ కూలీకి వచ్చిన ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఇప్పుడు సంచలనంగా మారింది. రోజుకు కేవలం రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంటూ ఆదాయపు పన్ను శాఖ ఆ వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆ లావాదేవీలకు సంబంధించి రూ.6 కోట్ల పన్ను చెల్లించాలని ఆదేశించడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అసలేం జరిగిందంటే..

మీర్జాపూర్ జిల్లాలోని లోకాపూర్ గ్రామానికి చెందిన శ్యామ్ బాబు 2020లో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని నెలల తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతని బావ ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ శ్యామ్ బాబు పేరుతో ఓ బ్యాంకు ఖాతా తెరిపించి, అవసరమైన పత్రాలతో పాటు చెక్‌బుక్‌పై కూడా సంతకాలు చేయించుకున్నట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం ఆ అకౌంట్ బుక్ తన నియంత్రణలో నుంచి తీసుకుని, కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపించాడు. మూడు నెలల క్రితం ఆదాయపు పన్ను శాఖ నుంచి మొదటి నోటీసు అందుకున్న శ్యామ్ బాబు, తన ఖాతాలో రూ.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. అనంతరం వరుసగా మూడు నోటీసులు రావడంతో పాటు రూ.6 కోట్ల పన్ను బకాయి చెల్లించాలని అధికారులు పేర్కొన్నారని వెల్లడించారు.

ఈ విషయాన్ని తన బావతో పాటు అత్తమామలకు చెప్పగా, “ఏమీ కాదు.. నిశ్శబ్దంగా ఉండు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని శ్యామ్ బాబు వాపోయాడు. ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయం చేస్తూ, మ్యాజిక్ వాహనం నడిపి రోజుకు రూ.400-500 మాత్రమే సంపాదిస్తున్నానని, అలాంటిది తాను కోట్ల రూపాయల పన్ను ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, తన పేరును దుర్వినియోగం చేసిన తన బావపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్యామ్ బాబు అధికారులను కోరుతున్నాడు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.