Site icon NTV Telugu

పగబట్టిన ‘కాకి’.. ఏకంగా ఏడుగురిపై దాడి

పాములు పగబట్టడం విన్నాం. కాకులు పగబట్టడం ఎక్కడైనా విన్నామా? అయితే కాకులు కూడా పగబడతాయని కర్ణాటక ప్రజలు వాపోతున్నారు. కాకులు ఎవరిమీద అయినా పగబడితే అవి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయని వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో ఓ కాకి పగబట్టి కొందరిపై దాడి చేస్తోంది. దీంతో సదరు కాకికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అక్కడ పందుల పంచాయతీ.. అసలేం జరిగింది?

ఓబళాపురం గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ కాకి గ్రామస్థుల్లో కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుంది. వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి వారిపైనే దాడిచేస్తోంది. గోళ్లతో రక్కడమే కాకుండా ముక్కుతో పొడుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా కొందరిపై కాకి పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామం నుంచి కాకిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నా.. అది వెళ్లడం లేదని స్థానికులు చెప్తున్నారు. ఈ వార్త విన్న నెటిజన్లు.. రాజమౌళి ఈగ సినిమాలో లాగా.. కర్ణాటకలోని కాకి కూడా గత జన్మలో జరిగిన ఘటనలు గుర్తుకుతెచ్చుకుని దాడి చేస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.

Exit mobile version