Congress: ఢిల్లీలో జరిగిన ఏఐ- ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ సభ్యులు నిరసనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ ఈవెంట్లో ఇలా రాజకీయాలు చేయడం ఏంటని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్కు చెందిన కార్యకర్తలు టీ షర్ట్స్ తీసేసి నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ ముందు లొంగిపోయారని ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైల్స్కు చెందిన వ్యాఖ్యలు టీషర్టులపై కనిపించాయి. ఈ ఘటనకు కారణమైన వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోడీకి వ్యతిరేకంగా అర్ధనగ్నంగా నిరసన తెలిపిన నలుగురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ నిరాకరించింది. వీరిని 5 రోజుల కస్టడీకి పంపింది.
ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సంచలన వాదన తీసుకువచ్చారు. నేపాల్లో జరిగిన హింసాత్మక జెన్-జెడ్ ఉద్యమం నుండి ఈ నిరసన ప్రేరణ పొందిందని, ఇది అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని వారు కోర్టుకు తెలిపారు.ఈ నిరసన వెనక పెద్ద కుట్ర ఉండొచ్చని, నిందితులును ముఖాముఖిగా, డిజిటల్ ఆధారాలతో విచారించడం అవసరం అని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిరసనకు నిధులు, టీ-షర్టుల ముద్రణకు ఎవరు డబ్బులు చ చెల్లించారో అని కూడా దర్యాప్తు చేశారు. ఈ టీ షర్టులపై ‘ప్రధాని రాజీ పడ్డారు’’, ‘‘ భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం’’, ‘‘ఎప్స్టీన్ ఫైల్స్’’ వంటి నినాదాలు ఉన్నాయి. ప్రధాని మోడీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నుండి దాదాపు 10 మంది కార్యకర్తలు శుక్రవారం ఇండియా-AI ఇంపాక్ట్ సమ్మిట్ వేదిక అయిన భారత్ మండపంలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని శనివారం ఉదయం పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు, విచారణ కోసం ఐదు రోజుల రిమాండ్ కోరుతున్నారు. నిందితుడి న్యాయవాది పోలీసుల వాదనలను తోసిపుచ్చారు, నిరసన శాంతియుతంగా జరిగిందని, ఎవరిపై దాడి జరగలేదని అన్నారు. బదులుగా, నిరసనకారులపై దాడి జరిగిందని చెప్పారు.
ఈ సంఘటన బిజెపి, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, భూపేంద్ర యాదవ్ సహా పలువురు బీజేపీ నాయకులు యూత్ కాంగ్రెస్ చర్యలను “జాతి వ్యతిరేకం” అని అభివర్ణించారు. అంతర్జాతీయ అతిథుల ముందు భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. బీజేపీ యువజన విభాగం, బిజెవైఎం, న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సమీపంలో నిరసన వ్యక్తం చేసి, భివాండిలోని రాహుల్ గాంధీకి నల్ల జెండాలు చూపించింది. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సమర్థించింది, నిరసనలను ప్రజాస్వామ్య హక్కుగా పేర్కొంది.
