Kerala: సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా విమానంలో కాంగ్రెస్ నిరసన..

Vijayan

Vijayan

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చేస్తోంది. కేరళ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలిపిన ఓ నిరసన తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయన్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఎగురుతున్న విమానంలో నినాదాలు చేశారు. సోమవారం కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి విజయన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఇలా విమానంలో నిరసన తెలిపడం ఇండియాలో ఇదే మొదటిసారి కావచ్చంటూ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

సీఎం విమానంలో ఉండగానే ఈ నిరసనలు జరిగాయి. దీంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి సన్నిహితులు, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ ఆందోళనకారుల్ని నెట్టివేశారు. సీఎంపై దాడి చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. కన్నూర్ విమానాశ్రయంలో నిరసనకారులు ప్రయాణికుల వేషధారణతో విమానంలోకి వచ్చినట్లు సమాచారం. బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న స్వప్న సురేష్ తనతో పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీంతో అప్పటి నుంచి కేరళ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.

ఇదిలా ఉంటే విమానంలో నిరసనలు తెలిపిన వారిపై చర్యలకు సిద్ధం అవుతోంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). విమానయాన నియమాలను ఉల్లఘించడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఇద్దరిపూ ‘నో ఫ్లై ’ చర్యలు తీసుకోవడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పినరయి విజయన్ కు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.