Congress: “మాకు ఓటేయకుంటే కరెంట్ కట్ చేస్తాం”.. ఓటర్లను బెదిరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

Raju Kaje

Raju Kaje

Congress: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ బెదిరింపు వ్యాఖ్యలు అక్కడ వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకుంటే విద్యుత్ నిలిపేస్తామని బెదిరించాడు.

Read Also: Kishan Reddy : రేవంత్ రెడ్డి పరిస్థితి దిగజారింది.. అపరిపక్వంగా, అహంకారంతో మాట్లాడుతున్నారు

చిక్కోడిలోని కగ్వాడ్‌ ఎమ్మెల్యే రాజు కేజ్ మాట్లాడుతూ..‘‘ మీరు మాకు ఆధిక్యం ఇవ్వకపోతే మేము కరెంట్ కట్ చేస్తాం. నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను’’ అని వ్యాఖ్యానించారు. ఓటర్లను భయపెట్టడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ ఎమ్మెల్యేకు కొత్త కాదు. ఇటీవల మరో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ మరణించిన సందర్భంలో ఎవరు వారసత్వం తీసుకుంటారు అని ప్రశ్నించడం విమర్శలకు కారణమైంది. గతంలో కూడా పీఎం మోడీ విలాసవంతమైన జీవనశైలి గడుపుతున్నారని, విమానాల్లో తిరుగుతున్నారని, దుస్తులపై దుబారా ఖర్చులు చేస్తున్నారంటూ ఆరోపించారు.

మరోవైపు రాజు కేజ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ నేత షెహజాదా పూనావాలా అతడిని బెదిరింపుల వ్యక్తిగా అభివర్ణించారు. కాంగ్రెస్ బెదిరించే వ్యూహాలకు పాల్పడుతోందని విమర్శించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓటర్ల సమస్యలను పరిష్కరించాలంటే తన తమ్ముడిని గెలిపించాలని గతంలో కోరారు. బెంగళూర్‌లోని నీటి సంక్షోభం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.