Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా

Rajendra Pal Gautam

Rajendra Pal Gautam

Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ ప్రక్షాళనకు తెరలేపింది. పలు కీలక రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా వంటి కీలక రాష్ట్రాలతో పాటు అనుబంధ సంఘాల్లోనూ భారీ మార్పులు చేసింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా రాజేంద్ర పాల్ గౌతమ్‌ను హైకమాండ్ నియమించింది. ఇప్పటివరకు అక్కడ బాధ్యతలు చూసిన అవినాష్ పాండే స్థానంలో గౌతమ్‌కు పగ్గాలు అప్పగించింది. అలాగే, హర్యానా ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి సీనియర్ నేత హరి ప్రసాద్‌ను తప్పించి, ఆయన స్థానంలో సంజయ్ దత్‌ను నియమించింది. ఇదే సమయంలో హరి ప్రసాద్‌కు కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు అప్పగించారు.

ఒడిశాకు కొత్త బాస్.. సేవా దళ్‌లోకి బీవీ శ్రీనివాస్!

ఒడిశా ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జ్‌గా లాల్జీ దేశాయ్‌ను నియమించారు. ఇప్పటివరకు అక్కడ పనిచేసిన అజయ్ కుమార్ లల్లు స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. మరోవైపు, లాల్జీ దేశాయ్ స్థానంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నేత బీవీ శ్రీనివాస్‌ను కాంగ్రెస్ సేవా దళ్ కొత్త ప్రధాన నిర్వాహకుడిగా తక్షణమే నియమిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా పదవుల నుంచి తప్పుకుంటున్న అవినాష్ పాండే, బీకే హరిప్రసాద్, అజయ్ కుమార్ లల్లుల సేవలను ఏఐసీసీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభినందించారు.

ఒకేసారి 509 మంది నియామకం..

మరోవైపు ఢిల్లీలో బూత్-స్థాయి నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ వ్యూహాన్ని అమలు చేసింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 509 మంది మండల అధ్యక్షులను శుక్రవారం నియమించింది. క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (DPCC) అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ప్రకటించారు. కొత్తగా నియమితులైన మండల అధ్యక్షులంతా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం చేపట్టబోయే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) నేపథ్యంలోనే కాంగ్రెస్ ఈ కీలక చర్యలు చేపట్టిందని చెబుతున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ (BLA)-1 కార్యకర్తలకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ నిచ్చామని, సవరణ ప్రక్రియలో ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ఏ ఒక్కరి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడకుండా కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.