Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా వచ్చారు. ఈ ఆందోళనకు ముందు పోలీసులు పర్మిషన్పై రాజకీయ నడిచింది. విదేశాల్లో ఉంటున్న ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సమావేశానికి యువత హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, సోనమ్ వాంగ్చుక్ వంటి వారు కూడా దీనికి మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు, ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులు మోహరించారు.
సోషల్ మీడియాలో తక్కువ సమయంలోనే 2.2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, శనివారం ఆందోళన కార్యక్రమానికి మాత్రం పట్టుమని 2000 మంది కూడా హాజరుకాలేదు. సోషల్ మీడియాలో భారీ హైప్ ఇచ్చి, గ్రౌండ్లో మాత్రం బొద్దింకలు చతికిలపడ్డాయి. 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉండీ, దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపుకు కనీస స్పందన కరువైంది. దీంతో సాధారణ నెటిజన్లు ఈ ఫాలోవర్లు ఎవరు? ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మంది ఫాలోవర్లలో 0.1 శాతం మంది కూడా రాలేదని ఎద్దేవా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సమావేశానికి సోనమ్ వాంగ్చుక్ హాజరై, మద్దతు తెలిపారు. అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఇండియా వస్తే జైలులో వేస్తారని తన తల్లి ఎంతగానే ఏడ్చిందని అన్నారు. నీట్ పేపర్ లీక్పై జరిగిన ఈ కార్యక్రమానికి విద్యా్ర్థుల తల్లిదండ్రులు కూడా హాజరుకాలేదని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు.

