Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ మోడీ సర్కార్కు అల్టిమేటం విధించింది. జూన్ 13 లోగా విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, జూన్ 20న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల్లో పదేపదే జరుగుతున్న అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు.
పూణేలో జరిగిన విలేకరుల సమావేశంలో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై దేశ యువత మౌనంగా ఉండేందుకు సిద్ధంగా లేరని అన్నారు. జూన్ 13 లోగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని హెచ్చరించారు. నీట్ పరీక్ష రద్దు తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని దీప్కే అన్నారు. నీట్, సీబీఎస్ఈ, సీయూటీ వంటి పరీక్షలకు సంబంధించిన సమస్యల వల్ల కోటికి పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారని, దీనికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని ఆరోపించారు.
ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జూన్ 06న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహించారు. జూన్ 13వ తేదీలోగా రాజీనామా చేయకపోతే పూణేలో ఉద్యమం మొదలవుతుందని, జూన్ 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూణేలో శాంతియుత నిరసన జరుగుతుందని, ఆ తర్వాత లక్నో, అమృత్సర్, జైపూర్, బెంగళూర్లో నిరసన నిర్వహిస్తామని దీప్కే చెప్పారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 20న దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకుంటారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించగలిగితే, విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించగలరని అన్నారు.

