అసమ్మతి సెగలు.. కెప్టెన్‌తో సోనియా గాంధీ భేటీ..!

Sonia Gandhi

Sonia Gandhi

పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్‌… సోనియా గాంధీ కలవనున్నారని సమాచారం. రేపు సాయంత్రం సోనియా అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పార్టీలో లేదా ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి… కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమరీందర్‌సింగ్‌లో సోనియా సమావేశం ఆసక్తి రేపుతోంది. ఇక సిద్దూ ఇప్పటికే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ కలిశారు. సీఎం అమరీందర్‌సింగ్‌, సిద్ధూ మధ్య పెరుగుతున్న వైరాన్ని పరిష్కరించడానికి హైకమాండ్ ఒక ఫార్ములాను రూపొందించినట్లు సమాచారం. సోనియాతో అమరీందర్ సమావేశం… వివాదాన్ని పరిష్కరించడానికే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక నవజోత్ సింగ్ సిద్ధు గత వారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలో కలిశారు. ముందు ప్రియాంకను కలిసిన ఆయన… మరుసటి రోజు రాహుల్‌తోనూ భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులపై తన అభిప్రాయాలను హైకమాండ్‌కు వివరించినట్టు వార్తలు ఇచ్చాయి. పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఆ సమయంలో అమరీందర్‌ ఢిల్లీలో ఉన్నప్పటికీ… అధిష్టానాన్ని కలిసే అవకాశం రాలేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో…. రేపు జరగబోయే భేటీ… అమరీందర్‌ తన వాదనను పార్టీ నాయకత్వం ముందే ఉంటే అవకాశం కనిపిస్తోంది.