CJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఉద్యమం తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఇప్పుడు సీజేపీ మరో ప్లాన్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్పై ఉద్యమించిందేకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీజేపీ నాయకులు ఢిల్లీలో రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్ను కలిశారు. రైతులు-విద్యార్థులు-యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేయాలని భావిస్తున్నారు.
సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, ఇతర కాక్రోచ్ ప్రతినిధులు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకులతో కలిసి టికాయత్తో సమావేశమయ్యారు. భవిష్యత్తులో రైతులు, యువత కలిసి చేపట్టబోయే వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత రాంకా మాట్లాడుతూ.. ‘‘దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై విద్యా సమస్యలతో పాటు రైతులు, యువత సమస్యల్ని కూడా ఉద్యమంలో భాగం చేయాలని సీజేపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల నిరసన సమయంలో కేంద్ర ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని సీజేపీ ఆరోపించింది. బీహార్, యూపీలలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని పేర్కొంది. విద్యార్థులపై నమోదైన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలని టికాయత్ మద్దతు కోరినట్లు సీజేపీ తెలిపింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలు, యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించింది.

