విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరాకరించారంటూ పెద్ద ఎత్తున మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. దీంతో సీజేఐపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వ్యవహారంపై సీజేఐ సూర్యకాంత్ కీలక వివరణ ఇచ్చారు. సీజేపీ నిరసనల కేసు విచారించేందుకు నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. అసలు ఆ అంశంపై ఇప్పటివరకు సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ కూడా దాఖలు కాలేదని వెల్లడించారు.
సుప్రీంకోర్టులో కేసుల ప్రస్తావన సమయంలో ఈ అంశంపై సీజేఐ స్పందించారు. కొంతమంది మీడియా సంస్థలు తాను పిటిషన్ను విచారణకు తీసుకోలేదని తప్పుగా ప్రచారం చేశారని వాపోయారు. ‘‘ఒక వ్యక్తి కేవలం ప్రాతినిధ్య పత్రం మాత్రమే ఇచ్చారు. కానీ మీడియా దాన్ని పిటిషన్గా చూపిస్తూ నేను విచారణకు నిరాకరించానని నిరాధార వార్తలు ప్రసారం చేసింది. రిజిస్ట్రీ దగ్గర పరిశీలించగా ఆ విషయంపై ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదు.’’ అని సీజేఐ వివరణ ఇచ్చారు. అసలు పిటిషన్ దాఖలు కాకుండానే కేసు పెండింగ్లో ఉందని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. బాధ్యత లేకుండా మీడియా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.
జూలై 20న ‘‘చలో సంసద్’’ పేరుతో సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వేలాది మంది పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నీట్ పరీక్షల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ఉపయోగించి అతిగా బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పోలీసులు మాత్రం నిరసనకారులే హింసకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ ఘటనపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించింది. నిరసనల సమయంలో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. అయితే తనపై అసత్య ప్రచారం జరుగుతోందని సీజేఐ సూర్యకాంత్ వాపోయారు.

