Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..

  • చంఢీగడ్ బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటనలో ఐదుగురు అరెస్ట్..
  • నిందితులకు పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు సమాచారం..
Bjp Office Attack

Bjp Office Attack

Chandigarh Blast: చంఢీగఢ్ బీజేపీ ఆఫీస్ వెలుపల జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతులో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, చండీగఢ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో చండీగఢ్ గ్రెనేడ్ దాడి కేసును ఛేదించిందని శనివారం పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

అరెస్టయిన వ్యక్తుల నుంచి ఇప్పటి వరకు ఒక గ్రెనేడ్, మరో బాంబును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీస్ టీమ్‌లు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠాకు ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు వెల్లడైంది. పోర్చుగల్, జర్మనీలలోని విదేశీ హ్యాండర్లను గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ దాడి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బీజేపీ కార్యాలయం బయట ఒక నాటు పేలుడు పదార్థాన్ని నిందితులు విసిరేశారు. ఇది పెద్ద శబ్ధంతో పేలింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. చంఢీగడ్‌లోని సెక్టార్ 37లో ఈ ఘటన జరిగింది. బుధవారం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గ్రెనేడ్ నుంచి పిన్ లాగి విసురుతున్న వీడియో వైరల్ అయింది. నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.