మధ్య ప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్ , ముడిచమురు సరఫరా విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేసింది. కేంద్ర హోం సెక్రటరీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఇంధన అక్రమ నిల్వలు (Hoarding) , నల్లబజారును అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీలు, చీఫ్ సెక్రటరీలను కోరారు. గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, భారత్కు ముడిచమురు దిగుమతులు నిరంతరాయంగా అందుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే చమురులో 70 శాతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వస్తోందని, అదనపు కార్గో షిప్లు కూడా మార్గమధ్యంలో ఉన్నాయని ఆమె వివరించారు.
పుకార్ల కారణంగా ప్రజలు ఇంధనాన్ని భారీగా నిల్వ చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ప్రతి రాష్ట్రం ఒక అధికారిక ప్రతినిధిని నియమించి, ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించింది. మీడియా సంస్థలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం వల్ల విమాన రాకపోకలపై ప్రభావం ఉన్నప్పటికీ, దేశీయంగా ఇంధన అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, కాబట్టి వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.