Site icon NTV Telugu

CBSE Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. టర్మ్-2 బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల

సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని.. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక ముందు ఎవరినీ కూడా పాస్ చేయబోమని స్పష్టం చేసింది.

కాగా ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. గ‌త ఏడాది జూలైలో ప్రక‌టించిన ప్యాటర్న్‌ ప్రకార‌మే ట‌ర్మ్-2 ప‌రీక్షలు జ‌రుగుతాయ‌ని చెప్పింది. మరో 26 దేశాల్లో కూడా బోర్డు పరీక్షలు జరుగనున్నాయని, దీంతో ఈ సమయానికి ముందుగా పరీక్షలను నిర్వహించడం వీలు కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసారి బోర్డు పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగవని వెల్లడించింది. జేఈఈ మెయిన్స్ వంటి ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. సుమారు 35 వేల సబ్జెక్టులు ఉండటంతో ఏ రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే రోజు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. కాగా టర్మ్-1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి.

Exit mobile version