Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య మరోసారి ‘‘కార్ డిప్లమసీ’’ చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య చర్చలు కేవలం టేబుల్ వరకు మాత్రమే పరిమతం కాలేదు. కారులో కూడా ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు. బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన పుతిన్, ఆయన కారు ‘‘అరస్ సెనాట్’’లో మోడీతో కలిసి ప్రయాణించారు. శనివారం బ్రిక్స్ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.
గతేడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా కూడా మోదీ, పుతిన్ ఇదే కారులో కలిసి ప్రయాణించారు. భారత మండపంలో భారత్-రష్యా ద్వైపాక్షిక చర్చలకు హాజరైన ఇద్దరు నేతలు, అక్కడి నుంచి ఒకే కారులో ఇన్నోప్రామ్ కార్యక్రమానికి వెళ్లారు. మరోసారి పుతిన్, మోడీ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆకర్షించింది.
గత కొన్ని దశాబ్ధాలుగా భారత్కు రష్యా అత్యంత నమ్మకమైన, మిత్రదేశంగా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పురోగమిస్తున్నాయి. పుతిన్ చివరిసారిగా 2025లో భారత్లో పర్యటించారు. కొన్ని రోజుల క్రితం కిర్గిజిస్తాన్లో జరిగిన SCO సదస్సులో మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. ఇప్పుడు, బ్రిక్స్ సమావేశంలో వీరిద్దరి భేటీ కీలకంగా మారింది.

