Jihadi drug: భారతదేశంలో తొలిసారిగా ప్రమాదకరమైన ‘‘జిహాదీ డ్రగ్’’ పట్టుబడింది. పేదవాడి కొకైన్గా కూడా పిలిచే ‘‘క్యాప్టాగన్’’ భారీగా పట్టుబడటంతో ఒక్కసారిగా భద్రతా ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. గుజరాత్లోని ముంద్రా పోర్ట్, ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) నిర్వహించిన ‘‘ఆపరేషన్ రేజ్పిల్’’లో రూ. 182 కోట్ల విలువైన క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిరియా దేశానికి చెందిన ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇలా పట్టుబడిన డ్రగ్ పై అధికారులు విచారణ ప్రారంభించారు.
Read Also: Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
క్యాప్టాగన్ను సాధారణంగా ‘‘జిహాదీ డ్రగ్’’, ‘‘పూర్ మ్యాన్స్ కొకైన్’’గా పిలుస్తారు. అతి తక్కువ ధరకు లభించడం దీని ప్రత్యేకం. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో, యుద్ధ ప్రాంతాల్లో ఈ డ్రగ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సిరియా అంతర్యుద్ధ సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు దీనిని పెద్ద ఎత్తున ఉపయోగించారు. దీన్ని తీసుకుంటే చాలా గంటలు నిద్ర లేకుండా ఉండటం, భయం, అలసట లేకుండా ఉండటం వంటి ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్లనే దీనిని ‘‘జిహాదీ డ్రగ్’’గా పిలుస్తారు.
నిజానికి 1960లలో దృష్టి లోపం, నార్కోలెప్సీ ఉన్న రోగులకు ఈ మందును చికిత్సలో ఉపయోగించేవారు. అసలు ఇది డ్రగ్ కాదు. దీని అసలు రూపం ‘‘ఫెనెథైలిన్’’. దీని ద్వారా వచ్చే మత్తు అలవాటుగా మారుతుందని అనేక దేశాలు దీనిని నిషేధించాయి. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో మాత్రమే క్యాప్టాగన్ దొరుకుతుంది. రహస్యంగా ఈ డ్రగ్లో యాంఫెటమైన్, మెతాంఫెటమైన్, కాఫీన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. ఈ డ్రగ్ను తీసుకుంటే కొంత సేపు ఉత్సాహంగా ఉన్నా, దీర్ఘకాలంలో తీవ్రమైన మానసిక సమస్యలు, హింసాత్మక ప్రవర్తన వంటి దుష్ప్రభవాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తు్నారు.
