NTV Telugu Site icon

IC-814 hijacking: “డాక్టర్” ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు.. కాందహార్ హైజాక్ ఘటనలో చేదు నిజాలు..

Ic 814 Hijacking

Ic 814 Hijacking

IC-814 hijacking: ది కాందహార్ హైజాక్’ నెట్‌ఫ్లిక్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇండియాలో సంచలనంగా మారింది. 1999లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ‘‘హర్కత్ ఉల్ ముజాహీదీన్’’ ఉగ్రవాదులు ఐదుగురు విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తరలించారు. ఉగ్రవాదుల డిమాండ్ల మేరకు, భారత ప్రయాణికుల్ని రక్షించుకునేందుకు కరడుగట్టిన ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. దీంట్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కూడా ఉన్నాడు. ఇతడే ఆ తర్వాత భారత పార్లమెంట్, ముంబై దాడులు, ఉరీ, పుల్వామా ఎటాక్స్‌కి కారణమయ్యాడు.

ఇదిలా ఉంటే, ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని భోలా, శంకర్ అని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ వెబ్ సిరీస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మరోసారి భారతదేశ ప్రజలు మనోభావాలను దెబ్బతినకుండా చూస్తామని నెట్‌ఫ్లిక్ ఇండియా కేంద్రానికి హామీ ఇచ్చింది. అయితే, ఆనాటి ఘోరకలిని ప్రయాణికులు గుర్తు చేసుకుంటున్నారు. హైజాకర్ల్ నిజమైన పేర్లు..ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ, అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ మరియు షకీర్.

Read Also: Actor Darshan: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రేణుకాస్వామి చిత్రహింసల ఫోటోలు వైరల్..

తమను ఇస్లాంలోకి మారాలని డాక్టర్ అనే కోడ్ నేమ్ కలిగిన ఉగ్రవాది షకీర్ అడిగినట్లు అప్పటి హైజాక్ విమానంలో ఉన్న మహిళ చెప్పారు. ప్రయాణికురాలు పూజా కటారియా తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వివరించారు. ఐదుగురు ఉగ్రవాదులకు బర్గర్, అంతాక్షరి, భోలా, డాక్టర్, శంకర్ అనే కోడ్ నేమ్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు. డాక్టర్ అనే వాడే రూపిన్ కత్యాల్ అనే ప్రయాణికుడి గొంతు కోసినట్లు చెప్పారు.

“ఫ్లైట్ టేకాఫ్ అయిన అరగంట తర్వాత టెర్రరిస్టులు ఫ్లైట్ హైజాక్ అయిందని ప్రకటించారు. మేము భయాందోళనలకు గురయ్యాము. మమ్మల్ని తల దించుకోమని అడిగారు. మేము కాందహార్‌లో ఉన్నామని కూడా మాకు తెలియదు. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు’’ అని కటారియా వెల్లడించారు. బర్గర్ అనే టెర్రరిస్ట్ ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉన్నాడని, అంత్యాక్షరి ఆడాలని చెప్పాడని ఆమె గుర్తు చేసుకున్నారు. డాక్టర్ అనే కోడ్ నేమ్ కలిగిన ఉగ్రవాది షకీర్ మమ్మల్ని ఇస్లాంలోకి మారాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు. 176 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ మరియు ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు.