Divorce Case: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లో కొత్తగా పెళ్లయిన ఒక మహిళ, మూడు రోజులకే విడాకుల కోసం అప్లై చేసుకుంది. పెళ్లి రాత్రి తన భర్త శారీరకంగా అసమర్థుడని ఒప్పుకున్నాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తర్వాత వచ్చిన వైద్య నివేదికలో వరుడు ‘‘తండ్రి కాలేదు’’ అని నిర్ధారణ అయిందని వధువు కుటుంబం పేర్కొంది. పెళ్లికి అయిన ఖర్చులు, బహుమతులు తమకు తిరిగి ఇవ్వాలని పెళ్లికూతురు కుటుంబం డిమాండ్ చేస్తోంది.
సదరు మహిళ పంపిన లీగల్ నోటీసులో ..‘‘శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో నేను నా జీవితాన్ని గడపలేదు. పెళ్లి రాత్రి అతను స్వయంగా నాకు ఈ విషయాన్ని చెప్పాడు’’ అని పేర్కొంది. 25 ఏళ్ల వరుడు సహజన్వాలోని ఒక సంపన్న రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. గోరఖ్పూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (GIDA)లోని ఒక పారిశ్రామిక యూనిట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. ఈ జంటకు నవంబర్ 28న వివాహం జరిగింది. డిసెంబర్ 01న ఫస్ట్ నైట్ రోజు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాను సంసారానికి పనికి రానని వరుడు చెప్పిన విషయాన్ని వధువు తన తండ్రికి చెప్పింది. దీంతో, ఆమె తండ్రి వరుడి కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా ఆమెను పుట్టింటికి తీసుకువచ్చాడు. వరుడి పరిస్థితిని దాచి వివాహం జరిపించారని వధువు కుటుంబం ఆరోపించింది. వరుడికి ఇది రెండో పెళ్లి, గతంలో ఇలాంటి కారణాలతోనే మొదటి వధువు పెళ్లయిన నెల రోజులకే విడిచిపెట్టి వెళ్లిపోయిందని సమాచారం.
ఈ వివాదం తర్వాత ఇరు కుటుంబాల సమ్మతితో వరుడిని గోరఖ్పూర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, అతను వైద్యపరంగా తండ్రి కాలేడని తేలిందని వధువు కుటుంబం చెప్పింది. పోలీసుల జోక్యంతో రాజీ కుదిరింది. వరుడి కుటుంబం పెళ్లి ఖర్చులక కింద రూ. 7 లక్షలు ఇవ్వడంతో పాటు బహుమతుల్ని నెల రోజుల్లో ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
