SC ST Atrocities Act: మత మార్పిడికి సంబంధించి బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ ఒక సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తిపై ‘ఎస్సీ/ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం’ కింద ఎలాంటి కేసులు పెట్టడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే ఎట్రాసిటీ చట్టం కింద లభించే రక్షణలు, హక్కులు వర్తించవని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఒక పిటిషన్ను విచారించిన జస్టిస్ వృషాలీ వి. జోషి ఏకసభ్య బెంచ్.. నిందితులైన ఒక దంపతులను ఎట్రాసిటీ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు కేసు ఏంటంటే..
బాధితురాలైన మహిళ అసలు హిందూ మహర్ (ఎస్సీ) సామాజిక వర్గానికి చెందినది. ఆమె 2011లో ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును కూడా మార్చుకుంది. అప్పటి నుంచి ఆమె ముస్లిం పద్ధతులనే పాటిస్తోంది. అయితే ఆమెకు తన భర్త వైపు బంధువులతో కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో 2015లో ఆమె ననద (భర్త సోదరి), నందోయ్ (ఆమె భర్త) వారి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇల్లు శుభ్రంగా ఉంచడం, తక్కువ నీరు వాడటం, టాయిలెట్ క్లీనింగ్ విషయాలపై వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. బంధువులు తనపై దాడి చేశారని, తాను గతంలో షెడ్యూల్డ్ కులానికి చెందినదాన్నని తెలిసి కూడా కులం పేరుతో దూషించారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల తరపు న్యాయవాది సత్యవ్రత్ జోషి కోర్టులో వాదిస్తూ.. “ఇది ఒకే కుటుంబానికి చెందిన సివిల్ (ఆస్తి) వివాదం. కోర్టు స్టే ఆర్డర్ నిందితులకు అనుకూలంగా రావడంతో, కక్షపూరితంగానే మహిళ ఈ అబద్ధపు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పైగా మతం మారిన మహిళపై ఎట్రాసిటీ చట్టం అసలు వర్తించదు” అని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.గవండ్ సైతం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘చింతడ ఆనంద్’ కేసు తీర్పును ఉటంకిస్తూ ఈ వాదనతో ఏకీభవించారు. ఒకసారి ఇస్లాంలోకి మారి, ఆ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు.. ఆమె పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ ఎట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందేందుకు అర్హురాలు కాదని స్పష్టం చేశారు.
హైకోర్టు తుది తీర్పు..
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ వృషాలీ వి.జోషి బెంచ్.. బాధితురాలు స్వయంగా ఇస్లాం స్వీకరించినట్లు అంగీకరించినందున, నిందితులపై ఉన్న ఎట్రాసిటీ చట్టం ఆరోపణలను పూర్తిగా కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎట్రాసిటీ కేసు నుంచి ఉపశమనం లభించినప్పటికీ నిందితులకు కష్టాలు పూర్తిగా తీరలేదు. బాధితురాలిపై భౌతిక దాడికి పాల్పడినందున, IPC లోని ఇతర సెక్షన్ల కింద నమోదైన నేరాలపై వారు కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు లీగల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

