Site icon NTV Telugu

Rahul Gandhi vs BJP: నిరాశతోనే ఆరోపణలు.. రాహుల్‌గాంధీ ఓట్ చోరీపై బీజేపీ కౌంటర్

Rahulgandhi

Rahulgandhi

అధికార పార్టీకి వత్తాసుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాజాగా మరోసారి శుక్రవారం ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.. 37 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి. ఆపై తిరిగి నిద్రపోండి.’’ అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు.

రాహుల్‌గాంధీ తాజా పోస్ట్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఎటాక్ చేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఓటమి పాలైందని విమర్శించారు. ఎన్నికల పరాజయాలు తట్టుకోలేక.. నిరాశతో రాహుల్‌గాంధీ ఈ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Lashkar Taiba: ఆపరేషన్ సిందూర్‌తో మా కార్యాలయం దెబ్బతింది.. లష్కరే తోయిబా వీడియో వైరల్

రాహుల్‌గాంధీని దేశ ప్రజలెవరూ నమ్మడంం లేదని.. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజలంతా మోడీనే తమ నాయకుడిగా భావిస్తున్నారని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికే వ్యవస్థలను నిందిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని ఎవరూ విశ్వసించడం లేదని తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: చెంపదెబ్బ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్

గురువారం జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నుంచి 37 సెకన్ల సారాంశాన్ని రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు. తన ఆరోపణలకు ‘‘100 శాతం బుల్లెట్ ప్రూఫ్ ఆధారాలు’’ ఉన్నాయని పేర్కొన్నారు. ఆ క్లిప్‌లో డిసెంబర్ 19, 2022న ఉదయం 4 గంటలకు ఎవరో ఒకరు ఓటరు జాబితా నుంచి రెండు పేర్లను తొలగించడానికి ఫారమ్‌లను తెరిచి, పూర్తి చేసి, సమర్పించారని, అన్నీ 36 సెకన్లలోపు ఎలా చేశారో వీడియోలో చూపించారు. ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ.. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేచి, 36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించి, తిరిగి నిద్రపోండి. అలా ఓట్ల దొంగతనం జరిగింది! ఎన్నికల నిఘా సంస్థ మేల్కొని, దొంగతనాన్ని చూస్తూ దొంగలను కాపాడుతోంది.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ లక్షల్లో ఓట్లు తొలగించింది. ఇదే పెద్ద దుమారాన్ని రేపింది. అధికార పార్టీకి వత్తాసుగా ఈసీ పని చేస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. అంతేకాకుండా పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది.

 

Exit mobile version