మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాను ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో కూడా బీజేపీ ఎంపీ వివరణ ఇచ్చారు. సర్పంచ్ అనే వ్యక్తి ఎన్నికల్లో రూ.7 లక్షలు ఖర్చు చేసి విజయం సాధిస్తాడని… మరోసారి గెలవాలంటే మరో రూ.7 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకో లక్ష రూపాయలు ఇతర ఖర్చులకు అదనం అని ఎంపీ జనార్ధన్ మిశ్రా చెప్పుకొచ్చారు. అందువల్ల సర్పంచ్ రూ.15 లక్షలు లంచం తీసుకుంటే ఎలాంటి తప్పు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంచాయతీ ఎన్నికల ర్యాలీ సందర్భంగానే బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.