Rahul Gandhi: రాహుల్ గాంధీపై ‘‘హత్యాయత్నం కేసు’’.. కాంగ్రెస్ కుట్ర ఆరోపణ..

  • పార్లమెంట్ దాడిపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫిర్యాదులు..
  • రాహుల్ గాంధీపై ‘హత్యాయత్నం’ కేసు పెట్టిన బీజేపీ ఎంపీలు..
  • కుట్ర కోణం ఉందని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీలు..
Rahul Gandhi Issue

Rahul Gandhi Issue

Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘హత్యాయత్నం’’ కేసు పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎంపీలపై కుట్ర, దుష్ప్రవర్తన కేసులను పెట్టింది. అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిపై రాహుల్ గాంధీ దాడి చేసినట్లు బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై దాడి, దాడికి ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: KTR: ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు..

పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల ఠాకూర్ మాట్లాడుతూ, “మేము BNS సెక్షన్ 109, 115, 117, 125, 131, 351, సెక్షన్ 109 హత్యాయత్నం, సెక్షన్ 117 స్వచ్ఛందంగా గాయపరచడం వంటి కింద ఫిర్యాదు చేసాము.” అని తెలిపారు. దాడిలో ఎంపీ సారంగితో పాటు మరో బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ గాయపడ్డారని బీజేపీ వెల్లడించింది. ఇద్దరి తలలకు గాయాలు కావడంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి ఐసీయూలో చేర్చారు.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కూడా ప్రతిగా ఫిర్యాదు చేసింది. మహిళా ఎంపీలతో సహా కాంగ్రెస్ ఎంపీల బృందం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కౌంటర్ ఫిర్యాదు నమోదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఈ సంఘటన వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఒక దళిత నాయకుడిని దుర్భాషలాడారని, నేడు మల్లికార్జున ఖర్గే నెట్టివేయబడ్డాడని ఇదంతా కుట్ర అని అన్నారు.