NTV Telugu Site icon

Uttar Pradesh: ‘‘బిస్లరీ’’కి బదులుగా కలెక్టర్‌కి ‘‘బిల్సెరీ’’ వాటర్ బాటిల్.. బుల్డోజర్ యాక్షన్ షురూ..

Up

Up

Uttar Pradesh: నిజమైన వాటర్ బాటిల్ పేర్లకు బదులుగా అదే పేరులా కనిపించే వేరే వాటర్ బాటిళ్లను మార్కెట్‌లో చూస్తుంటాం. కేవలం స్పెల్లింగ్‌ని మార్చి, బ్రాండెంట్ వాటర్ బాటిల్‌లా కనిపించేలా తయారు చేస్తుంటారు. బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో మనకు ఎక్కడో చోట ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌కి కూడా ఇదే ఘటన ఎదురైంది.

బాగ్‌పట్ జిల్లా కలెక్టర్ జితేంద్ర ప్రతాప్ సింగ్‌ జిల్లాలోని స్థానిక పోలీస్ పోస్టుని సందర్శించిన సమయంలో ‘‘బిల్సెరీ’’ పేరుతో ఉన్న 500 ఎం.ఎల్ బాటిల్‌ని అందించారు. దీంతో నకిలీ వాటర్ బాటిల్ తయారీ సంస్థలపై బుల్డోజర్ యాక్షన్‌కి ఆదేశాలు ఇచ్చారు. ‘‘బిస్లరీ’’కి బదులుగా నకిలీ వాటర్ బాటిల్‌పై ‘‘బిల్సేరి’’అని లేబుల్ ముద్రించబడి ఉంది.

Read Also: Karnataka: ‘‘ఇజ్రాయల్’’ ట్రావెల్స్ ‘‘జెరూసలెం’’గా మారింది.. ఓ వర్గం అభ్యంతరం పేరు మార్పు..

బిల్సేరి అని తనకు ఇచ్చి వాటర్ బాటిల్‌ని చూసి కలెక్టర్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎస్పీ అర్పిత్ విజయ వర్గియాతో పాటు, కలెక్టర్ బాటిల్‌ని నిశితంగా పరిశీలిస్తే దానికి సరైన లైసెన్సులు కూడా లేనట్లు తేలింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆహార భద్రత శాఖను సింగ్ వెంటనే ఆదేశించారు. అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ మన్వేంద్ర సింగ్ విచారణ ప్రారంభించారు. విచారణలో స్థానిక దుకాణ యజమాని భీమ్ సింగ్ తన ఇంటి నుంచి అక్రమ గోదాముని నడుపుతున్నట్లు గుర్తించారు. జిల్లా అంతటా నకిలీ వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తేలింది.

గోదాంలో భద్రపరిచిన 2663 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటికి బిస్లరీ బ్రాండ్‌కి సంబంధించినట్లే ఆకుపచ్చ రంగు, స్పెల్లింగ్‌లో కొద్దిగా మార్పులో తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. వీటిన నమూనాలను ప్రయోగశాలకు పంపారు. మిగతా బాటిళ్లన్నింటిని బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఈ నకిలీ బాటిల్ వాటర్ ఉత్పత్తులను హర్యానా నుండి సరఫరా చేస్తున్నట్లు మరియు బాగ్‌పత్‌లోని వివిధ దుకాణాలకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అటువంటి నకిలీ ఉత్పత్తుల పంపిణీపై వేగంగా చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు.