Site icon NTV Telugu

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!

Singer Zubeen Garg

Singer Zubeen Garg

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై తలెత్తిన అనుమానాలే నిజమవుతున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి ముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా జుబీన్ గార్గ్ మంచి ఈతగాడు కూడా. అలాంటిది ఆయన హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్త తెలిసి అస్సామీయులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక జుబీన్ గార్గ్ మరణాన్ని వ్యక్తిగతంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఆయన సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. సిట్ తేల్చకపోతే సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తానంటూ తెలిపారు.

ఇక రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం కొన్ని గంటల్లోనే కీలక విషయాలను రాబట్టింది. జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్‌ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, కో-సింగర్ అమృత్‌ప్రవ, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామిని అరెస్ట్ చేశారు. ఇక జుబీన్ గార్గ్ ఈతకొడుతున్న దృశ్యాలు కో సింగర్ అమృత్‌ప్రవ తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. ఈ వీడియోలు దర్యాప్తునకు చాలా కీలకంగా మారాయి.

ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!

ఇక విచారణలో బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన విషయాలు బయటపెట్టాడు. జుబీన్ గార్గ్‌కు మేనేజర్ సిద్ధార్థ శర్మ విషమిచ్చి చంపినట్లు వెల్లడించాడు. హోటల్‌ దగ్గర నుంచి బోటింగ్ వరకు సిద్ధార్థ శర్మ ప్రవర్తన చాలా భిన్నంగా కనిపించిందని తెలిపాడు. బోటింగ్‌ను నావికుడి దగ్గర నుంచి సిద్ధార్థ శర్మ తన స్వాధీనంలోకి తీసుకున్నాడని.. ఆ సమయంలో సముద్రం మధ్యలో చాలా గందరగోళానికి గురైనట్లు చెప్పాడు. ఇక బోటులో స్వయంగా సిద్ధార్థ శర్మనే పానీయాలు అందించాడని.. తమను ఎలాంటి ఆహారం అందించొద్దని సూచించాడని తెలిపాడు. ఇక జుబీన్ గార్గ్ ఈతకు దిగకముందే విష ప్రయోగం జరిగిందని.. ఇక ఈతకు దిగిన తర్వాత ఎవరూ దగ్గరకు వెళ్లొద్దని సిద్ధార్థ శర్మ సూచించాడని.. అంతేకాకుండా బోటుకు సంబంధించిన వీడియోలు ఎవరికీ షేర్ చేయొద్దని చెప్పినట్లుగా పేర్కొన్నాడు. అమ్మాయిల సరఫరా కూడా సిద్ధార్థ శర్మనే చూసుకున్నాడని తెలిపాడు. కుట్ర బయటపడకుండేందుకు విదేశీ మద్యాన్ని ఏర్పాటు చేశాడని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Trump-Hamas: ట్రంప్ ప్లాన్‌పై హమాస్ సంచలన నిర్ణయం

ఇక జుబీన్ గార్గ్ ఈత కొడుతున్న సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ‘‘జబో దే, జబో దే’’ (అతన్ని వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి) అని పదే పదే సిద్ధార్థ శర్మ చెబుతున్న మాటలు వీడియోలో రికార్డైంది. అతడి హావభావాలు కూడా చాలా విచిత్రంగా కనిపించాయి. ఇదిలా ఉంటే జుబీన్ గార్గ్ ఒకసారి ఈతకెళ్లి తిరిగి బాగానే వచ్చాడని.. రెండోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు రాలేదు. మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ బృందం సింగపూర్ కూడా వెళ్లనుంది.

ఇక జుబీన్ గార్గ్‌కు పోస్ట్‌మార్టం నిర్వహించిన ఒక వైద్య నిపుణురాలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. జుబీన్ గార్గ్ ఈత కొట్టడం వల్ల చనిపోలేదని.. వేరే కారణం ఉందని ఆమె సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానాలు బలపడ్డాయి. దీంతో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ప్రాథమిక రిపోర్టులో సిద్ధార్థ శర్మను దోషిగా రిమాండ్ నోట్‌లో పేర్కొంది.

జుబీన్ గార్గ్ సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఇక జుబీన్ గార్గ్ మరణంపై ఆయన భార్య గరిమా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. జుబీన్ గార్గ్‌ను బలవంతంగా సింగపూర్ తీసుకెళ్లారని గరిమా గార్గ్ ఆరోపించారు. సింగపూర్ తీసుకెళ్లాక జుబీన్ గార్గ్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు గుండె జబ్బు ఏమీలేదని చెప్పారు. జుబీన్ గార్గ్ ప్రయాణంలో అలసిపోయారని.. అలాంటి వ్యక్తిని ఎందుకు పిక్నిక్, ఈతకు ఎందుకు తీసుకెళ్లారని ఈవెంట్ నిర్వాహకులను గరిమా గార్గ్ నిలదీశారు. జుబీన్ గార్గ్ మేనేజర్ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేదని ప్రశ్నించారు. జుబీన్ గార్గ్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని స్పష్టం చేశారు.

Exit mobile version