పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం దాన్ని తొలగించారు. వంద శాతం ఉద్యోగాలను కన్నడిగులకే ఇవ్వాలని ప్రభుత్వం యోచించడాన్ని అన్ని ప్రైవేటు సంస్థలు ఖండించాయి. ఇలాంటి నిర్ణయమే ఇతర రాష్ట్రాలు, దేశాలు తీసుకుంటే కన్నడిగులు తిరిగి రావలసి ఉంటుందని విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధరామయ్య వెనక్కి తగ్గింది.
ఇక తాజాగా ఇదే అంశంపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు. బయట వ్యక్తులు పనికి రావడంతో బెంగళూరులో జనాభా 1.4 కోట్లు దాటిందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటనపై పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెట్టుబడిదారులు కర్ణాటకకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. బయటి వ్యక్తులు పని చేయడానికి బెంగళూరుకు రావడంతో జనాభా 1.4 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. స్థానికుల ఉద్యోగ కోటాపై ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.